– కావ్య కు వరంగల్ ఎంపీ టికెట్ ఖాయం?
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక
– కడియం చేరికతో కాంగ్రెస్ లో కలవరం
– అప్రమత్తమైన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు
– ఎంపీ టికెట్ కోసం బిఆర్ఎస్ నేతల ప్రయత్నం
– కెసిఆర్ పర్యటనతో బిఆర్ఎస్ లో ఉత్సాహం
విధాత ప్రతినిధి: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్యతో కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న కడియం శ్రీహరి, కావ్యకు టీపీసిసి ఇంచార్జ్ దిపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కడియం శ్రీహరితో పలు విషయాలపై చర్చించారు.వీరితో పాటు వేం నరేందర్ రెడ్డి గారు,రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– గులాబీ పార్టీపై తీవ్ర ప్రభావం
కడియం శ్రీహరి తో పాటు కావ్య చేరికతో గులాబీ పార్టీకి గట్టి షాక్ తగల నున్నది. వరసగా సాగుతున్న వలసలలో భాగంగా కడియంతోపాటు కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దీని ప్రభావం గులాబీ పార్టీపై పడనున్నది. నిన్నటి వరకు కడియం కుమార్తె కావ్యను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయగా ఆకస్మిక రాజకీయ పరిణామాలతో నూతన వరంగల్ ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సిన ఆవశ్యకత ఆ పార్టీకి ఏర్పడింది. అభ్యర్థిగా ఎంపికైన కావ్య పార్టీ అధినేత కేసిఆర్ కు తీవ్ర ఆరోపణలతో లేఖ రాయడమే కాకుండా, ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులపై పడనున్నది. ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న గులాబీ అభ్యర్థుల్లో కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం అంతర్గతంగా ఆలోచనలో పడవేస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నది.
– కావ్య కు వరంగల్ కాంగ్రెస్ టికెట్ ఖాయం
బీఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన కడియం కావ్య రాష్ట్రంలో నెలకొన్న ఆకస్మిక రాజకీయ పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్ కు రాజీనామా చేయడమే కాకుండా రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీకి విముఖత ప్రదర్శించిన విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం కడియం కావ్య తన తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో సహా కాంగ్రెస్లో చేరిపోయింది. దీంతో కావ్యకు కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కడియం కావ్యకు ఎంపీ అభ్యర్థిత్వం రానున్న రోజుల్లో శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే హామీ తోనే తండ్రి, కుమార్తెలు కాంగ్రెసులో చేరినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో నేడో రేపో కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
– కాంగ్రెస్ ఆశావాహుల్లో కలవరం
ఇదిలా ఉండగా తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కావ్యకు టికెట్ వస్తుందనే సమాచారంపై నిన్నటి వరకు ఆ పార్టీలో వరంగల్ ఎంపీ అభ్యర్థిత్వం ఆశించిన పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం అనేక విధాలుగా శ్రమించిన తమను కాదని నిన్న పార్టీలో చేరిన కావ్యకు అవకాశం ఎలా కల్పిస్తారు అంటూ మండిపడుతున్నారు. కావ్యకు టికెట్ ఇస్తే నెలకొనే పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిష్కరిస్తుందనే ఆసక్తి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో నెలకొంది.
– అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిష్టానం
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిత్వం ఎంపికపై అంతర్గతంగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఈ పోటీలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న, బాబు మోహన్, తెలంగాణ ఉద్యమకారులు జోరిక రమేష్, బోడ డిన్నతో పాటు పలువురు పేర్లను బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కడియం పార్టీ వీడిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నాయకత్వం అప్రమత్తమై మిగిలిన ద్వితీయ శ్రేణి కేడర్ పార్టీ చేజారి పోకుండా చర్యలు చేపట్టింది. ఇప్పటికే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బిజెపిలో చేరడంతో ఆ సెగ్మెంట్లో పార్టీ నాయకత్వం ఖాళీ ఏర్పడింది. తాజాగా స్టేషన్గన్పూర్ లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. నష్ట నివారణ చర్యలతో పాటు రానున్న ఎన్నికలకు పార్టీ నాయకులు, కేడర్ను సమాయత్తం చేసేందుకు సోమవారం హనుమకొండలో వరంగల్ పార్లమెంటు పరిధి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు రానున్నట్లు హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. మరోవైపు వర్ధన్నపేటలో కేడర్ చేజారకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఇదిలా ఉండగా ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఆదివారం జిల్లాలోని దేవరుప్పుల మండలం లో పర్యటించి రైతులను పరామర్శించడంతో మరోసారి గులాబీ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.