Karegutta Hills encounter| కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల హతం

చత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ 2లో భాగంగా గురువారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా సమాచారం. ఎన్ కౌంటర్ కొనసాగుతంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 19, 2026, 12:22 pm IST
Read Time: 5 mins
Karegutta Hills encounter| కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల హతం

విధాత : చత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ 2లో భాగంగా గురువారం భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఆపరేషన్ కగార్ కు మార్చి 31 వరకే గడువు మిగిలిన నేపథ్యంలో కర్రెగుట్టల్లో దాగిన మావోయిస్టుల ఏరివేతకు 5వేల మంది సీఆర్ఫీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.

ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని, మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని భద్రతా బలగాలు తెలిపాయి. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సోది కోసం సహా ముఖ్య నాయకులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారన్న సమాచారంతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

మిగిలిన గడువు 40రోజులే..

ఆపరేషన్‌ కగార్‌ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ అడవులు, మహారాష్ట్ర, ఒడిశా వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పలువురు కీలక నేతలతో పాటు వందలాది మావోయిస్టులు ఎదురుదాడుల్లో మృతిచెందారు. రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ అగ్రనేత మోస్ట్‌ వాంటెడ్‌, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడివి హిడ్మా కూడా మృతి చెందారు. మల్లోజుల వేణుగోపాల్ వంటి అగ్రనేతలు 1000మందికి పైగా లొంగిపోయారు. ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది.

అయితే ఆపరేషన్ కగార్ తో.. మార్చి 31నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం నిర్ధేశించింది. ఇందుకోసం కేవలం 40రోజులు మాత్రమే సమయం ఉండటంతో భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరం చేశారు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో 5వేల మంది భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టి కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. హెలిక్యాప్టర్లు, డ్రోన్లను, శాటిలైట్ టెక్నాలాజీని వినియోగిస్తు ముందుకు సాగుతున్నారు. భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు తెలంగాణ వైపు పారిపోయి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో తెలంగాణ, ఏపీ, ఒడిస్సా సరిహద్దుల వెంట, చత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలు ఫోకస్ చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఆ ప్రాంతా గ్రామీణ ప్రజల్లో వ్యక్తమవుతుంది.