Library | ఖమ్మం జిల్లా( Khammam District )కు చెందిన పారుపల్లి అజయ్ కుమార్( Parupalli Ajay Kumar ) రిటైర్డ్ టీచర్. ఆయన భార్య చావ దుర్గా భవాని( Chava Durga Bhawani ) కూడా రిటైర్డ్ ప్రిన్సిపాల్. ఇక పారుపల్లి అజయ్ కుమార్.. సరదాగా కాలక్షేపం చేయాలనుకోలేదు. నిరుపేద విద్యార్థులకు చదువుకునేందుకు వనరులు కల్పించి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తన తండ్రి పారుపల్లి సత్యనారాయణ( Parupalli Satyanarayana ) పేరిట ఓ గ్రంథాలయాన్ని( Library ) ప్రారంభించారు. అది కూడా తన సొంతింట్లోనే పారుపల్లి సత్యనారాయణ పుస్తకాలయం( Parupalli Satyanarayana Pustakalayam ) పురుడు పోసుకుంది.
2019, జూన్ 30వ తేదీన ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ లైబ్రరీలో మొత్తం 67 వేల పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ కాంపీటీటివ్ పరీక్షలకు సంబంధించినవే. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ఆధారంగా ప్రామాణిక పుస్తకాలను సమకూర్చారు. ఇక ఈ లైబ్రరీకి రోజుకు వందల మంది నిరుద్యోగ అభ్యర్థులు వచ్చి చదువుకుంటుంటారు. అక్కడికి వచ్చే అభ్యర్థులకు కేవలం పుస్తకాలే సమకూర్చలేదు.. మంచి నీటి సదుపాయం, ఉచిత వైఫై, టాయిలెట్ సౌకర్యం కల్పించారు. ఇందుకు నెలకు రూ. 20 వేల వరకు రిటైర్డ్ టీచర్ దంపతులు వెచ్చిస్తున్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రం నుంచే కాకుండా.. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్్ జిల్లాల నుంచి కూడా ఈ లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారు. ఈ లైబ్రరీలో చదువుకున్న నిరుద్యోగ అభ్యర్థుల్లో 70 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అసిస్టెంట్ ఇంజినీర్లు, కానిస్టేబుల్స్, గ్రూప్-4 ఉద్యోగాలతో పాటు టీచర్ జాబ్లను సాధించి.. ప్రస్తుతం విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు.
ఈ సందర్భంగా టీచర్ దంపతులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు కష్టపడి చదువుకోని ఉద్యోగాలు సాధించేందుకు తమ గ్రంథాలయం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. రోజుకు వందల మంది విద్యార్థులు తమ గ్రంథాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అవసరమైన పుస్తకాలను చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ లైబ్రరీలో చదువుకున్న వారు.. ప్రభుత్వ కొలువులు సాధించారని ఆ దంపతులు తెలిపారు.