బాలికల హాస్టల్ లో ఓ భారీ కొండ చిలువ ప్రవేశించడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న గిరిజన బాలికల హాస్టల్లోకి అర్ధరాత్రి 12 అడుగుల భారీ కొండచిలువ చొరబడింది. గదిలో నుంచి బుసలు వినిపించడంతో ఇద్దరు విద్యార్థినులు అప్రమత్తమై తలుపులు వేశారు.
రిటైర్డ్ అటవీ ఉద్యోగి మహమ్మద్ చాకచక్యంగా దాన్ని పట్టుకుని అటవీ అధికారుల సూచన మేరకు అడవిలో వదిలేశారు. కొండచిలువను పట్టుకునే క్రమంలో అది మహమ్మద్ మెడకు చుట్టుకుని మల విసర్జన చేసింది. కొండ చిలువను పట్టుకోవడంతో అప్పటివరకు ఆందోళనకు గురైన బాలికలు ఊపిరి పీల్చుకున్నారు. సమీప అటవీ ప్రాంతం నుంచి కొండచిలువ ఆహారాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థినులు పాములు, విష కీటకాలు, వన్యప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు స్నేక్ కేచర్ మహమూద్ సుమారుగా 60 వరకు వివిధ రకాల పాములు, కొండచిలువలను పట్టుకున్నారు. సత్తుపల్లి ప్రాంతంలో ఎక్కడికి పాములు వచ్చిన వెంటనే మహమ్మద్ కు సమాచారం అందించడం కొనసాగుతూ వస్తుంది.