నల్గొండను ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దుతా: మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పట్టణంలో రద్దీగా ఉండే రోడ్లపై పాదాచారుల వంతెన ఏర్పాటు చేయడం అందరికీ ఎంతో మేలు చేస్తుందని అన్నారు

హైదరాబాద్, ఆగస్టు 15 (విధాత) : నల్గొండ పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పట్టణంలో రద్దీగా ఉండే రోడ్లపై పాదాచారుల వంతెన ఏర్పాటు చేయడం అందరికీ ఎంతో మేలు చేస్తుందని అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న సేయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాల వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పాదాచారుల వంతెన పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేయింట్ ఆల్ఫాన్సెస్ పాఠశాల వద్ద ప్రతిరోజూ విద్యార్థులతో రద్దీగా ఉంటుందని, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకుగాను పాదాచారుల వంతెనను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రహదారులతో పాటు ,మురికి కాలువలు, సిసి రోడ్లు వంటివి నిర్మిస్తున్నామని, పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాదాచారుల వంతెన వల్ల ట్రాఫిక్ ఇబ్బందు లేకుండా ఉండడమే కాకుండా, ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.