గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో బీరు బాటిళ్లు.. ఘటనపై విచారణకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రూమ్లో శనివారం 4 బీరు బాటిళ్లు కనిపించడంతో ఆమె రూమ్కు తాళం వేసి విద్యార్థినిలు నిరసన తెలిపారు

వెలుగు చూసిన ప్రిన్సిపల్ నిర్వాకం
సస్పెండ్ చేసిన అధికారులు
విధాత, హైదరాబాద్ : సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రూమ్లో శనివారం 4 బీరు బాటిళ్లు కనిపించడంతో ఆమె రూమ్కు తాళం వేసి విద్యార్థినిలు నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ శైలజ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, భోజనం సరిగ్గా పెట్టడం లేదని, ప్రశ్నిస్తే చేయి చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రిన్సిపల్ను మార్చాలంటూ విద్యార్థినిలు మూడు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.
ప్రిన్సిపల్ శైలజ తన చాంబర్లోనే కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి అర్ధరాత్రి వరకు మందు తాగుతారని, తన కుమారుడిని రోజుల తరబడిగా హాస్టల్లోనే ఉంచుకుంటూ తమను గదుల నుంచి బయటకు రావద్దని ఆంక్షలు పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థినిల ఆందోళనపై స్పందించిన సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కో-ఆర్డినేటర్ అరుణకుమారి, ఆర్డీవో వేణుమాధవరావులు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డీఎస్పీ రవికుమార్, సీఐ రాజశేఖర్, రూరల్ ఎస్సై బాలునాయక్ కళాశాలకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. శైలజను సస్పెండ్ చేయడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.
ఘటనపై మంత్రి ఉత్తమ్ సీరియస్
ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు కనిపించిన ఘటనపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సీరియస్ అయ్యారు. విచారణ జరిపించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ను ఫోన్లో ఆదేశించారు. దీంతో కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్ లత, సభ్యులుగా జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, ఆర్డీవో వేణుమాధవ్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి లతతో విచారణ కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు.