విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్లర్లు, ఇతరులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం హుజూర్ నగర్లోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన ఆయన బియ్యం, ఇతర సేవల నాణ్యతను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు 54 లక్షల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కిలో బియ్యం అందుతున్నాయని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 6 కిలోల బియ్యాన్ని అందిస్తుందని వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి మొత్తం సేకరణ ఖర్చు కిలోకు రూ.39 అయితే, దాదాపు 70-75% రేషన్ బియ్యాన్ని మిల్లర్లు, ఇతర అసాంఘిక సంస్థలు రీసైకిల్ చేస్తున్నాయని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుందని, బియ్యం రీసైక్లింగ్లో ఎవరైనా ప్రమేయం ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు, లేదా ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
రూ.56 వేల కోట్ల భారీ అప్పులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్పై దాదాపు రూ.56 వేల కోట్ల భారీ అప్పుల భారం మోపిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పు రూ.3300 కోట్లు మాత్రమేనని, ప్రస్తుతం రేషన్ పంపిణీ, వరి ధాన్యం సేకరణ బాధ్యత కలిగిన కార్పొరేషన్ వార్షిక వడ్డీ భారం రూ.3,000 కోట్లు దాటిందని చెప్పారు. గత ప్రభుత్వం ఈ శాఖ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో దశాబ్ద కాలంగా కార్పొరేషన్కు రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీ లేదా బ్యాంక్ గ్యారెంటీ లేకుండా రైస్ మిల్లర్లకు రూ.22,000 కోట్ల విలువైన వరి నిల్వలను అప్పగించిన విధానాన్ని ఆయన విమర్శించారు. కార్పొరేషన్ ఇప్పుడు ప్రమాదకర, ఆందోళనకరమైన స్థితిలో ఉందన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వం నుండి గణనీయమైన బియ్యం నిల్వలను కొనుగోలు చేయడానికి ముందుకొస్తే, గత ప్రభుత్వం రాజకీయ కారణాల వల్ల బియ్యాన్ని గోడౌన్లలో పాడైపోవడానికి కారణమైందని విమర్శించారు.
బియ్యాన్ని కర్ణాటకకు మార్కెట్ ధరలకు విక్రయించకుండా వడ్డీ ఖర్చులతో కార్పొరేషన్పై భారం మోపిందని అన్నారు. కార్పొరేషన్లో ఆడిట్ను వేగవంతం చేసి, రేషన్ కార్డుదారులు, ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు సేవలను మెరుగుపరిచేందుకు, శాఖను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ చెప్పారు.