అవినీతి, అశాంతి లేని సుస్థిరమైన సుపరిపాలనతో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి జరిగే పాలన ప్రధాని మోదీ గ్యారంటీ అని, అందుకే మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు
మల్కాజిగిరిలో నా గెలుపు అభివృద్ధికి సోపానం
విధాత, హైదరాబాద్ : అవినీతి, అశాంతి లేని సుస్థిరమైన సుపరిపాలనతో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి జరిగే పాలన ప్రధాని మోదీ గ్యారంటీ అని, అందుకే మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తన లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల, అయోధ్య నగర్ లో,చింతల్ డివిజన్ లోని మాణిక్య నగర్, శ్రీనివాస్ నగర్, గణేష్ నగర్, ద్వారక నగర్ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓట్లు అభ్యర్థిస్తూ తమ ఇళ్లకు వచ్చిన ఈటలకు మహిళలు, కాలనీ వాసులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వారి సమస్యలు తెలుసుకుని, బీజేపీని గెలిపించాల్సిన అవసరాన్ని వారికి వివరించారు. ప్రపంచస్థాయి రహదారుల నిర్మాణం, గ్రామాల్లో రోడ్ల నిర్మాణంతో ప్రధాని మోదీ దేశాభివృద్ధిని పరుగులు పెట్టించారని తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు, మెట్రో నెట్వర్క్ విస్తరణ సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం మన మోదీ గ్యారంటీ అని, మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారి అభ్యున్నతి కోసం అనుక్షణం ప్రధాని మోదీ పాటుపడుతారని, వెనుకబడిన, అణగారిన వర్గాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం మన మోదీ గ్యారంటీ అన్నారు. మన మోదీని గెలిపించడం మన గ్యారంటీగా పేర్కోన్నారు.
మోదీ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తా
రేపు కేంద్రంలో ప్రధాన మంత్రి అయ్యేది నరేంద్ర మోదీ అని, పేదలకు ఇల్లు కట్టించే బాధ్య్తత నేనే తీసుకుంటానని హామీ ఇస్తున్నానన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ దగ్గరికి నేరుగా వెళ్ళగలిగే పరిచయం ఉన్న వ్యక్తిగా మల్కాజ్ గిరికి ఐటి హబ్ రావాలన్నా, డ్రైనేజీలు రావాలన్నా, రోడ్లు వేయాలన్నా నన్ను మీరు గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన హామీలను అమలు చేయకుండా ఏరుదాటక బోడ మల్లయ్య మాదిరిగా వ్యవహారిస్తుందని విమర్శించారు. ఆడబిడ్డలకు 2500, వృద్ధుళకు 4000 పెన్షన్, యువతులకు లక్ష రూపాయల కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు, ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. అతి తక్కువ కాలంలో రేవంత్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగం మారుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. ప్రధాని మోదీ స్వయంగా తన ప్రాణమున్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయని, రాజ్యాంగాన్ని కదిలించేది లేదని స్పష్టం చేశారన్నారు. గతంలో ప్రగల్బాలు పలికిన కేసీఆర్ను ప్రజలు ఎక్కడికి పంపించారో చూశామని, రేపు రేవంత్రెడ్డికి అదే గతి పడుతుందన్నారు.