17 పార్లమెంటు స్థానాల్లో నాలుగు శాతం లేని రెడ్లకు ఆరు సీట్లు కేటాయించి, 50% పైగా ఉన్న బీసీలకు రెండు స్థానాలు కేటాయించి, 12 శాతానికి పైగా ఉన్న మాదిగలకు స్థానమే లేకుండా
విధాత: 17 పార్లమెంటు స్థానాల్లో నాలుగు శాతం లేని రెడ్లకు ఆరు సీట్లు కేటాయించి, 50% పైగా ఉన్న బీసీలకు రెండు స్థానాలు కేటాయించి, 12 శాతానికి పైగా ఉన్న మాదిగలకు స్థానమే లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ మాదిగల ద్రోహి అని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుదామన్నారు. శుక్రవారం షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం మాలలతో కుమ్మక్కై అతన్ని నమ్మిన మాదిగలని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాదని రెడ్ల, మాలల ప్రభుత్వమని విమర్శించారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి స్థానికేతరుడైన మల్లురవిని కేటాయించడం అన్యాయమన్నారు. అదే విధంగా అతని సోదరుడు మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా అనేక పార్లమెంటు నియోజకవర్గాల్లో మాదిగలకు సామాజిక న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలను అణగదొక్కుతున్న ఈ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్ట గళ్ళ ప్రశాంత్ మాదిగ, ఆనెగళ్ళ ఆనంద్ మాదిగ, వినోద్ మాదిగ, చెందగల అశోక్ మాదిగ, మామిళ్ళపల్లి శ్రీనివాస్, మహేందర్ మాదిగ, జంగయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.