multi-level parking । కేబీఆర్‌ వద్ద పార్కింగ్‌ కష్టాలకు తెర.. మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థకు ఆమోదం

ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఇక్కడ పార్క్‌ చేసుకోవచ్చు. యంత్రాలు, స్మార్ట్‌ కార్డ్‌(smart card)ల ద్వారా పార్కింగ్‌ టికెట్‌లు జారీ చేస్తారు. ముందగానే పార్కింగ్‌ బుక్‌ చేసుకునేందుకు, నావిగేషన్‌, ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్‌ యాప్‌ను కూడా తీసుకురానున్నారు.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Sep 13, 2024, 8:20 pm IST
Read Time: 4 mins
multi-level parking । కేబీఆర్‌ వద్ద పార్కింగ్‌ కష్టాలకు తెర.. మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థకు ఆమోదం

multi-level parking । హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద పార్కింగ్‌ కష్టాలకు ఇక తెర పడనున్నది. ఇక్కడ మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నవ నిర్మాణ్‌ అసోసియేట్స్‌ (Nava Nirman Associates)కు అనుమతి ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ (KBR Park) వద్ద పార్కింగ్‌ అనేది తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేకించి ఉదయం, సాయంత్రం పూట పార్క్‌కు, పార్క్‌లో వాకింగ్‌కు వచ్చేవారు  తీవ్ర పార్కింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరోవైపు రోడ్డుకు ఒకవైపున వరుసగా వాహనాలు పార్క్‌ చేయడంతో వాహనాల రాకపోకలపై ప్రభావం పడుతున్నది. ఈ నేపథ్యంలో ఆ కష్టాలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ పూనుకొన్నది. మల్టీలెవెల్‌ పార్కింగ్‌ వ్యవస్థ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇక్కడ 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మల్టీలెవెల్‌  పార్కింగ్‌ వ్యవస్థను నిర్మించనున్నారు. ఇందులో 72 ఈక్వివలెంట్‌ కార్‌ స్పేసెస్‌ (equivalent car spaces (ECS)) ఉంటాయి. మొత్తం పార్కింగ్‌ విస్తీర్ణంలో 20 శాతాన్ని ద్విచక్రవాహనాల కోసం కేటాయిస్తారు. దీనిని నవ నిర్మాణ్‌ అసోసియేట్స్‌ డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (DBFOT) పద్ధతిలో నిర్మిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఇక్కడ పార్క్‌ చేసుకోవచ్చు. యంత్రాలు, స్మార్ట్‌ కార్డ్‌(smart card)ల ద్వారా పార్కింగ్‌ టికెట్‌లు జారీ చేస్తారు. ముందగానే పార్కింగ్‌ బుక్‌ చేసుకునేందుకు, నావిగేషన్‌, ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్‌ యాప్‌ను కూడా తీసుకురానున్నారు. పార్కింగ్‌ సజావుగా సాగేందుకు డిజిటల్‌ సర్వీసుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇది వస్తే కేబీఆర్‌ పార్క్‌ వద్ద వాహనాల పార్కింగ్‌ ఇబ్బందులు, వాటి వల్ల కలిగే ట్రాఫిక్‌ జామ్‌లకు చెక్‌ పెట్టినట్టు అవుతుందని భావిస్తున్నారు.