జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన విధానం … మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి

జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర మహాసభలకు వెళుతున్న సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.

  • Publish Date - June 18, 2024 / 07:55 PM IST

విధాత, హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర మహాసభలకు వెళుతున్న సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పట్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయని జర్నలిస్టులలో ఒక రకమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ గా తాను, సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డితో చర్చించి జర్నలిస్టుల సంక్షేమ కోసం విధి, విధానాలు రూపొందిస్తే వెంటనే సంతకం చేసి అమలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో జర్నలిస్టుల్లో ఈ ప్రభుత్వం పట్ల సానుకూల భావనలు ఏర్పడ్డాయని వెల్లడించారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి శాసనసభ వ్యవహారాలు, ఓటు ఆన్ అకౌంట్, తదుపరి లోక్ సభ ఎన్నికలు వరుసగా రావడంతో పరిపాలనపై దృష్టి కేంద్రీకరించే విషయం కొంత అలస్యమైందన్నారు. అయితే రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించడం జరిగిందని, త్వరలో జర్నలిస్టుల సమస్యల పరిష్కర చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇల్లు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడియేషన్లు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో 24 వేల అక్రిడియేషన్లు కలిగి ఉన్నామని వివరించారు. అనర్హులకు అక్రిడియేషన్లు అందకుండా చూడటంతో పాటు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తప్పకుండా అక్రిడియేషన్ అందేలా చేస్తామన్నారు. అనర్హులు అక్రిడియేషన్ పొందడం వల్ల జర్నలిజం వృత్తి, వ్యక్తిత్వం మసక బారే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలతో ముగుస్తున్న అక్రిడియేషన్ల గడువును మరో మూడు నెలలు పెంచి ఈ లోపుగా కొత్త అక్రిడియేషన్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూస్తామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు కొణిజేతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Latest News