Rain Alert | రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారైంది. 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు మండుటెండలకు విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బకు గురవుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాతావతరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. పలు జిల్లాల్లో 44 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పుల కారణంగా ఉత్తర తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రి వేళ కూడా భారీగా ఉక్కపోత ఉండడంతో చిన్నారులు కునుకు పట్టడం లేదు.
శనివారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రోజు రోజుకూ ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
