పార్లమెంటు ఎన్నికల వేళ గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తాం..ఇప్పటిదాకా ఏం చేశామో చెప్పకుండా మా అన్నదమ్ములిద్దరిని చంపే ప్రయత్నం జరుగుతుందంటూ సానుభూతి మాటలెందుకని ఎంఐఎం ఎమ్మల్యే అక్బరుద్ధిన్పై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ వేశారు
మిమ్మల్ని ఎక్కడి పంపాలో మా ప్రభుత్వం నిర్ణయిస్తుందని కామెంట్
విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల వేళ గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తాం..ఇప్పటిదాకా ఏం చేశామో చెప్పకుండా మా అన్నదమ్ములిద్దరిని చంపే ప్రయత్నం జరుగుతుందంటూ సానుభూతి మాటలెందుకని ఎంఐఎం ఎమ్మల్యే అక్బరుద్ధిన్పై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ వేశారు. నన్ను మా అన్నను అరెస్టు చేస్తారని, కాల్పులు జరిపి లేదా జైల్లో విషం పెట్టి చంపవచ్చంటూ అక్బరుద్ధిన్ సెంటిమెంట్ డైలాగ్లతో ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారి ప్రాపకం సంపాదించి అడ్డగోలుగా సంపాదించుకోవడం, ఆస్తులు పోగేసుకోవడమే తప్ప పాతబస్తీ ప్రజలకు ఒవైసీ సోదరులు ఇన్నాళ్లుగా చేసిందేమి లేదన్నారు. అయినా అక్కడ అమాయక ఓటర్లు ఒవైసీ సోదరులను గెలిపిస్తునే ఉన్నారన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంతో అంటకాగుతున్న ఒవైసీ సోదరులు మరింత సంపాదించుకునే పనిలో పడ్డారన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు మీ ఒవైసీ సోదరులిద్దరు ఇప్పటిదాకా చేసినట్లుగానే మా ప్రభుత్వ అధికారుల కాళ్లపై పడతారన్నారు. అప్పుడు నిన్ను, మీ అన్నను ఎక్కడికి పంపాలనేది మేం తేలుస్తామని, అది మా పని అని రాజాసింగ్ చెప్పారు. అప్పటిదాకా అక్బరుద్ధిన్కు ఎలాంటి భయం అవసరం లేదని, ఇంకా నాలుగు సంవత్సరాలు సమయం ఉన్నందునా ఈ లోపల ఎంత మోసం చేయాలో.. ఎంత దండుకోవాలో దండుకో అని, నాలుగేళ్ల తర్వాతా మిమ్మల్ని ఏం చేయాలో మేం తేలుస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.