నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చిన బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డితో పాటు పలువురు విద్యార్థి ఉద్యమ నాయకులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు.
విధాత, హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చిన బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డితో పాటు పలువురు విద్యార్థి ఉద్యమ నాయకులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారికి పోలీసులకు మధ్య తోపులాట వాగ్వివాదం చోటుచేసుకుంది. మోతీలాల్ నాయక్ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేశ్ రెడ్డిలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనాలలో ఎక్కించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని బొల్లారం పోలీసు స్టేషన్కు తరలించారు. కాగా గాంధీ హాస్పిటల్ వద్ద పోలీసుల వ్యవహరించిన తీరుపై పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోలీసులతో నిరుద్యోగుల ఆందోళనలను అణిచివేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నిరుద్యోగుల డిమాండ్లు మెగా డీఎస్పీ, గ్రూప్ పోస్టుల పెంపు, జాబ్ క్యాలెండర్ సహా అన్ని డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.