3వ వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. విధాత, మెదక్ బ్యూరో: ఇటీవల కురిసిన వడగండ్ల వానకు ప్రధానంగా జిల్లాలోని 8 మండలాలలో మొక్కజొన్న, జొన్న వంటి పంటలు దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వడగండ్ల వాన వల్ల పంట నష్టపోయిన వివరాలను గతంలో ప్రాథమికంగా అంచనా వేసి నివేదిక అందించగా నేడు ప్రభుత్వం నిర్దేశించిన ప్రొఫార్మాలో వ్యవసాయ విస్తరణాధికారులు తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాలలో రైతు వారీగా పక్కాగా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వానికి […]
విధాత, మెదక్ బ్యూరో: ఇటీవల కురిసిన వడగండ్ల వానకు ప్రధానంగా జిల్లాలోని 8 మండలాలలో మొక్కజొన్న, జొన్న వంటి పంటలు దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వడగండ్ల వాన వల్ల పంట నష్టపోయిన వివరాలను గతంలో ప్రాథమికంగా అంచనా వేసి నివేదిక అందించగా నేడు ప్రభుత్వం నిర్దేశించిన ప్రొఫార్మాలో వ్యవసాయ విస్తరణాధికారులు తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాలలో రైతు వారీగా పక్కాగా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిస్తున్నామని అన్నారు.
సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో క్లస్టర్ లో గ్రామాల వారీగా, రైతు వారీగా ఎన్ని ఎకరాలలో ఏ ఏ పంటలు దెబ్బతిన్నాయి.. అందరు పట్టాదారులేనా లేక కౌలుదారులున్నారా వంటి వివరాలను ఏ.ఈ.ఓ. లను అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నామని అన్నారు.
అనంతరం ధాన్యం కొనుగులు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షిస్తూ ఈ నెల 3 వ వారంలో ఏర్పాటు చేయబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. 30 రోజులు చాలా క్లిష్టమైన రోజులని, వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని వరి కొనుగోలు సెంటర్లకు రైతులు తీసుకువచ్చే విధంగా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు.
మండల స్థాయిలో రెవిన్యూ పోలీస్ సహకార సంఘం ఐకేపీ మహిళా సంఘాల అధికారులతో సమన్వయ పరచుకుంటు పంట కోత కోసే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ధాన్యాన్ని కోసే విధంగా హార్వెస్టర్ యజమాన్యం కు తగు సూచనలు చేస్తూ ఒక క్రమపద్ధతిలో రైతులు ధాన్యం తీసుకువచ్చే విధంగా రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా రైతుల నుండి ముందుగానే బ్యాంకు వివరాలు సేకరించి పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద వసతులు కల్పించి కేంద్రాలు పారదర్శకంగా, సజావుగా జరిగేలా అంకిత భావంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఆశా కుమారి, ఉద్యాన అధికారి నర్సయ్య, వ్యవసాయ సహాయ సంచాలకులు, ఏ.ఈ.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.