విధాత, హైదరాబాద్: ‘అరుదైన పక్షి, జంతు జాతులను రక్షించడం కోసం ప్రభుత్వాలు వాటి లెక్కలు తీస్తున్నాయి. కానీ, దేశ జనాభాలో సగం కన్నా ఎక్కువ ఉన్న బీసీల జనాభా ఎంతో తెలియదు. బీసీ కుల గణన వెంటనే చేపట్టాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. దేశంలో బీసీల జనాభా ఎంత ఉన్నదని తెలుసుకోవటానికి నేటికీ బ్రిటీష్ హయాంలో జరిగిన జనాభా లెక్కలే ప్రామాణికంగా కొనసాగుతుండటం దురదృష్టకరమన్నారు. ఫలితంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీ వర్గాలు నష్టపోతున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో బీసీ కుల గణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప బీఆరెస్ చేసింది శూన్యమన్నారు. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్న మాట ఉత్తముచ్చటగా మిగిలిపోయింది. ప్రభుత్వంలోనే కాకుండా కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చి రాజకీయంగా కూడా బీసీలను అణగదొక్కాలనే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని, సామాజిక-ఆర్థిక-రాజకీయ న్యాయాన్ని దేశ ప్రజలందరికీ అందిస్తామనే ఆశయాన్ని రాజ్యాంగం ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా జనాభాలో సగ భాగమైన బీసీల పరిస్థితిలో ఏ మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరి కుల దామాషా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీ జనగణన డిమాండ్ ను పట్టించుకోవడం లేదన్నారు. బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోదీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్ ను నేరవేర్చడానికి చొరవ చూపకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.
దేశంలో సగానికి పైగా జనాభా వున్న బీసీల విషయంలో కేంద్రం లెక్కలేనితనం చూపడం దారుణమైందని మండిపడ్డారు. బీహార్ మాదిరిగా బీఆరెస్ ప్రభుత్వం కూడా తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సైతం బయటపెట్టాలన్నారు. అప్పుడే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కుతుందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.