దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్న మోదీ: తీన్మార్ మల్లన్న

కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని, అంబానీలకు దోచిపెడుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు

దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్న మోదీ: తీన్మార్ మల్లన్న
  • పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆరెస్‌ నాలుగు ముక్కలవుతుంది
  • 46 జీవోపై వచ్చే అసెంబ్లీలో కమిటీ వేసి రద్దు చేస్తాం
  • ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి
  • రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • ఎమ్మెల్సీగా గెలిపిస్తే రాజకీయాలలో సమూల మార్పులు తీసుకువస్తా
  • తనకున్న రూ.1.50కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగింత
  • ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన

విధాత : కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని, అంబానీలకు దోచిపెడుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. శుక్రవారం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్‌) నామినేషన్ దాఖలు కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరి గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆరెస్‌ పదేళ్లు అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్‌, కేటీఆర్‌లు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాలుగు ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు కవిత జైలుకెళ్ళిందని, వారు కూడా జైలుకెళ్లక తప్పదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్‌లకు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు.

పట్టబద్ధుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తనకున్న ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేయడం మామూలు విషయం కాదన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను లక్ష మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని కోరారు. జీవో 46తో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ జీవోపై కమిటీ వేసి రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

మార్పుకోసమే రాజకీయాల్లోకి…నా ఆస్తి ప్రభుత్వానికి అప్పగింత : తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం ఇస్తే రాజకీయాలలో సమూల మార్పులు తీసుకువస్తానని స్పష్టం చేశారు.ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న తన కుటుంబానికి ఉన్న ఒక కోటి 50 లక్షల రూపాయలను ప్రభుత్వానికి రాసిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్లి తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అప్పగించనున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు జవాబుదారిగా ఉంటానని ప్రకటించారు. గ్రాడ్యుయేట్లంతా ఈ ఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో, అవినీతి సొమ్ముతో గెలుపొందాడని విమర్శించారు. గెలిచిన తర్వాత చేతకాక నిరుద్యోగులను వంచనకు గురి చేశాడని ధ్వజమెత్తారు. తనకు మద్దతునిస్తున్న రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పాల్గొని ప్రసంగించగా, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ, ఖమ్మం,వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ట్రస్మా సంఘం నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు.