రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 18వ తేదీ శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనున్నది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నవి, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినేట్ లో చర్చించనున్నారు
రుణమాఫీకి నిధుల సమీకరణ
ధాన్యం కొనుగోళ్లు, వనాకాలం పంటలు, ఆదాయం పెంపు మార్గాలు
విద్యాశాఖ, కాళేశ్వరం రిపేర్పై చర్చ
విధాత: రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 18వ తేదీ శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనున్నది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నవి, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినేట్ లో చర్చించనున్నారు. ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరుగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినేట్ లో చర్చిస్తారు.
కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతుంది. స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు.