Mahesh Kumar Goud : అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీల నియామకం పూర్తి
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకారం, అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో అన్ని డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి అవుతుంది.

ఢిల్లీ: అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలోని అన్ని డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి అవుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఖర్గే ఆదేశించారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ చీఫ్ కలిశారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు మహేశ్ కుమార్ వివరించారు.
క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్దేశించారని, సంస్థాగత పునర్నిర్మాణం పగద్బందీగా, ఏ గ్రూపు ఒత్తిడికి లొంగకుండా పనిచేయాలన్నారు. అక్టోబర్ 4 వ తేదీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. అక్టోబర్ 15 వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను ఏఐసీసీ పరిశీలకులు సమర్పిస్తారని మహేశ్ కుమార్ తెలిపారు. అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.