తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు డిజిటల్ కేబినెట్ సమావేశాల సన్నాహకాల్లో భాగంగా ప్రత్యేక టాబ్ లను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు అందచేశారు. డిజిటల్ కేబినెట్ అమలు తీరుతెన్నులను ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
ఈ కేబినెట్ కు ప్రత్యేక బడ్జెట్
డిజిటల్ కేబినెట్ విధానం అమలుకు రూ.2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి తొలివిడతగా రూ.20 లక్షల నిధుల విడుదలకు సైతం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఉత్తారాఖండ్లో డిజటల్ కేబినెట్(ఈ-కేబినెట్) విధానం అమలులో ఉంది. ఆ రాష్ట్రం అమలు చేస్తున్న సొల్యూషన్స్ను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వీసెస్ ఇన్ కార్పొరేటెడ్తో ప్రభుత్వం చర్చలు జరిపింది. అంతేకాకుండా ఈ క్యాబినెట్ అమలుకు టీడీటీఎస్ను నోడల్ ఎజెన్సీగా ప్రభుత్వం నియమించింది. పరిపాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ కేబినెట్ విధానంతో ప్రయోజనాలు
ఈ కేబినెట్ విధానంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు ట్యాబ్లు, కంప్యూటర్ల ద్వారా ఎజెండాలు, ఫైల్స్ వీక్షణ అవకాశం ఉంటుంది. కేబినెట్ నోట్స్, ప్రతిపాదనలు, నిర్ణయాలు పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. సమాచారం లీక్ అవ్వకుండా, సాఫ్ట్ వేర్ హ్యాక్ అవ్వకుండా ప్రత్యేక లాగిన్ ఐడీ, పాస్ వర్డ్స్తో సెక్యురిటీ చర్యలు అమలు చేస్తారు. ఈ కేబినెట్ విధానంలో ఎక్కడ నుండి అయినా.. ఎప్పుడైనా కేబినెట్ ఎజెండాలను మంత్రులు పరిశీలించే సౌకర్యం ఉంటుంది. దీంతో సమావేశాలకు ముందు, తరవాత ఫైళ్ల నిర్వహణ సులభతరం కానుంది.
