TGSRTC | హైదరాబాద్ : సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఎండీ వై నాగిరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక బస్సులు హైదరాబాద్, నర్సంపేట, తొర్రూరు, భూపాలపల్లి, మణుగూరు, కరీంనగర్, మంథని, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, పరకాల, నిజామాబాద్, గోదావరిఖని, మంచిర్యాల నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. భక్తులు ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకుని, సురక్షిత ప్రయాణం చేయాలన్నారు. భక్తులు www.tgsrtcbus.in ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
కాళేశ్వరంలోని త్రివేణీ సంగమం ఉత్సవ శోభను సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతీ నది ఉద్భవించిన ప్రదేశంలో గురువారం తెల్లవారుజామున 5:43 గంటలకు అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
