విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగులు లేవనెత్తుతున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆరెస్ బాటలోనే సాగుతుందని.. కోచింగ్ సెంటర్లు డబ్బులు ఇస్తే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని సీఎం అభాండాలు వేస్తుంటే కంచె చేను మేసినట్టు ఉందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. స్వరాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. ప్రభుత్వం మారినా నిరుద్యోగుల సమస్యలలో మార్పు రాలేదని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని విమర్శించారు. అహంకారంతో వ్యవహరిస్తే కేసీఆర్కు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే పడుతుందన్న సోయితో కాంగ్రెస్ పాలకులు పనిచేయాలని హితవు పలికారు. బేషజాలకు పోకుండా వారు అడుగుతున్న డిమాండ్స్ పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరంతా ఉన్నత చదువులు చదివిన వారని, వీరికి ఏజెన్సీల ద్వారా జీతాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీలు పోయినా 9 వేలు కూడా రావడం లేదన్నారు. వీళ్లు అడుగుతున్న డిమాండ్లు పెద్దవి కావని, డిపార్ట్మెంట్ నేరుగా జీతాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని, నెల వారీగా జీతాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగం తీసివేయకుండా భద్రత కల్పించాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్కార్డులు కల్పించాలని కోరుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నామన్నారు.
నిరుద్యోగుల సమస్యలపై బీఆరెస్ బాటలోనే కాంగ్రెస్ : ఈటల రాజేందర్
