విధాత, హైదరాబాద్ : ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి కోసం ఆరాటపడుతూ జల్పా జీవితం గడుపుతున్నాడంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జల్సాల కోసం తరచూ విదేశాల్లో పర్యటించడం ప్రజలను విస్మరించడం క్షమించరాని తప్పిదమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ చేసిన హెచ్చరిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ మేరకు మీడియాకు ప్రభాత్ లేఖను విడుదల చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరులు భూ కబ్జాలు మోసాలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. రౌడీలను, భూ కబ్జాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రోత్సహిస్తున్నాడని ప్రభాత్ ఆరోపించారు. అప్పటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై దౌర్జన్యాలు, మోసాలతో విసుగెత్తిన ప్రజలు గడ్డం వినోద్ను గెలిపించారన్నారు. ప్రజల సమస్యలు, కష్టాలకంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మంత్రి పదవి పైనే ధ్యాస ఉందన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గత బీఆరెస్ ప్రభుత్వ హయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో ఎన్నికల లబ్ది కోసం ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా రెవెన్యూకు అప్పగించిన సింగరేణి క్వార్టర్లకు ఇంటి నెంబర్లు ఇప్పిస్తామని లక్షల రూపాయలు తీసుకొని వినోద్ అనుచరులు మోసం చేశారని ధ్వజమెత్తారు. పట్టాలు ఇచ్చే పేరిట లక్షలాది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసి ఇంతవరకు ఇంటి నెంబర్లు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం లేదన్నారు.
సింగరేణి క్వార్టర్స్కు కరెంటు పునరుద్దరించాలి
మందమర్రి జనరల్ మేనేజర్ మనోహర్ సింగరేణి క్వార్టర్స్కు కరెంట్ కట్ చేసే చర్యలకు పాల్పడడంతో పట్టణంలోని వివిధ బస్తీలకు చెందిన కార్మికులు, రిటైర్ కార్మికులు గత నాలుగు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నారన్నారు. దోమల బెడద, విషజ్వరాలు, అంధకారంతో బస్తీ లోని ప్రజలు అల్లాడుతుంటే గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఎమ్మెల్యే వినోద్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. నియోజక వర్గానికి చెందిన వేమనపల్లి మండల, గ్రామాల ప్రజలు వర్షం ప్రభావంతో వరదలతో ముంపునకు గురైన పంటపొలాలు కొట్టుకుపోయి, ఇండ్లు కూలిపోయి బురద మట్టి తిప్పలు పేరుకుపోయి గత పది రోజులుగా ప్రభుత్వ సహాయం కొరకు ప్రజలు అల్లాడుతుంటే ఎమ్మెల్యే విందులు, వినోదాలు, షికార్లతో ఆయిల్ మసాజ్ లతో, పబ్లు, క్లబ్లు, నీలి చిత్రాలకు పరిమితమై ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వినోద్ తన పద్ధతులు మార్చుకొని ప్రజల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి బెల్లంపల్లి క్వార్టర్లకు పట్టాలు, ఇంటి నెంబర్లు ఇవ్వాలని అంతవరకు సింగరేణి అధికారులు కంపెనీ కరెంటు తొలగిస్తే మందమర్రి జనరల్ మేనేజర్ మనోహర్, ఎమ్మెల్యే వినోద్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నామని ప్రభాత్ పేర్కొన్నారు. తక్షణం సింగరేణి అధికారులు ‘తొలగించిన కంపెనీ కరెంటును పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.