విధాత, హైదరాబాద్ : సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్ ఎదురైంది. ఉప్పరపల్లి కోర్టు ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల(ఆగస్టు 11 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు.
ఈ నెల 18న తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. వైద్య పరీక్షలలో బాధితురాలి మెడ, గొంతు నులిమినట్లు, చెంప, కాలిపై కమిలిన గాయాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. బాధితురాలికి నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
