విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేసిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి శనివారం భద్రకాళి దేవాలయం వద్దకు కుటుంబ సభ్యులతో వచ్చారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వినయ్ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. నాయిని సవాల్ కు ఆయన నుంచి స్పందన రాలేదు.
దీంతో కాంగ్రెస్ పశ్చిమ అభ్యర్థిగా ఎంపికైన నాయిని రాజేందర్ రెడ్డి భద్రకాళి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తన సవాల్ ప్రతిస్పందనగా ఎవరైనా వస్తారా అని కొద్దిసేపు వేచి చూశారు. ఎవరూ రాకపోవడంతో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు, ప్రమాణాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.