అక్రమ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని, పార్టీని కాపాడుకోవడంలో లీగల్ టీం తోడ్పాటునందిస్తుందని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సోమా భరత్ కుమార్ అన్నారు
విధాత, వరంగల్ ప్రతినిధి: అక్రమ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని, పార్టీని కాపాడుకోవడంలో లీగల్ టీం తోడ్పాటునందిస్తుందని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సోమా భరత్ కుమార్ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశం మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో అడ్వకేట్ జనార్ధన్ గౌడ్ అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ కోసం కొట్లాడిన అనేక సంఘాల్లో లాయర్ల జేఏసీ అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో సైతం పోరాడిన చర్రిత అడ్వకేట్లదని కొనియాడారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు కేసులు, జైలు శిక్షలుపడితే… లాయర్లు స్వంత ఖర్చుతో బెయిళ్లు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సేవలందించే అడ్వకేట్లకు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉంటుందని, హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీల ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ బలోపేతానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. కేసీఆర్ సైతం న్యాయవాదులకు ఇన్సూరెన్స్లు చేయించారని, బడ్జెట్లో నిధులు సైతం కేటాయించిన ఘనత ఆయనకు సొంతమని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై మోపే అక్రమ కేసులను లీగల్ సెల్ ద్వారా ఎదుర్కొంటామని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల లీగల్ సెల్ నూతన కమిటీ ఏర్పాటు అభినందనీయమని అన్నారు. పార్టీకి అనుబంధంగా ఏళ్లుగా సేవ చేసిన న్యాయవాదులకు రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల లీగల్ సెల్ నూతన కమిటీలను భరత్ కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డా. సుధీర్ కుమార్, కుడా మాజీ చైర్మన్లు సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, మర్రి యాదవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
– కమిటీ వివరాలు
హనుమకొండ – వరంగల్ జిల్లా అధ్యక్షుడు – గుర్రాల వినోద్, ఉపాధ్యక్షులు – శ్రీరాం కిరణ్ కుమార్, నాయిని రవి
వసంత్ యాదవ్, వేణు పటేల్, ఎంకే అంబేద్కర్, అంజయ్య గౌడ్, అబ్దుల్ నబీ
ప్రధాన కార్యదర్శి – జీ శివరాజ్, కోశాధికారి- పీ శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు- పీ బస్వరాజు, శ్రీరామ్ నాయక్, మహేష్ పటేల్, నవీన్ కుమార్, రాం ప్రసాద్, అరుణ, కమిటీ సభ్యులు – సమ్మిరెడ్డి, ప్రవీణ్ కుమార్, సంపత్, జాషువా, కే ఉషా, రాజు, చాంద్ పషా, మల్లేశంను నియమించారు.