తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తాం … తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి

కేంద్రంలో మరోసారి కొలువుతీరనున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచచేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.

  • Publish Date - June 9, 2024 / 05:05 PM IST

విధాత : కేంద్రంలో మరోసారి కొలువుతీరనున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచచేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులుగా తెలంగాణకే చెందిన బండి సంజయ్‌తో కలిసి మోదీ కేబినెట్‌లో మంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సంకల్పపత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే అయిదేళ్లు అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రోడ్లు, రేషన్ బియ్యం, గ్రామాలకు మంచినీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు.

 

గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కార్యకర్తలంతా ఎంతో కష్టపడి పని చేశారని, వారి శ్రమ వల్లే రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచామని చెప్పారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన 88 స్థానాల్లో గెలవాలని, ఆ లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేయాలని కోరారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నేతలకు మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. తెలంగాణ నుంచి ఒక కేంద్రమంత్రి, ఒక సహాయ మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీ అధిష్ఠానానికి ధన్యవాదాలు చెప్పారు. కేంద్ర మంత్రులుగా అంకితాభావంతో పనిచేస్తామన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సామాన్య కార్యకర్తను గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకురాలేదని.. నరేంద్ర మోడీ వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. సికింద్రాబాద్ పరిధిలో తన గెలుపు కోసం పని చేసిన పదాధికారులు, మోర్చాల అధ్యక్షులకు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసిందని, అయినప్పటికీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారన్నారు. మోదీ ప్రమాణస్వీకారం పూర్తికాగానే మేళతాళాలతో కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారని, రాష్ట్రంలోనూ ఆ కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడిగా కేడర్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు.

Latest News