CM Revanth Reddy । చేనేత రుణాలు రూ.30 కోట్లు మాఫీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
చేనేత రుణాలు రూ.30కోట్లు మాఫీ చేసి చేనేత కార్మికులను రుణ విముక్తులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతన్న ఎంత ముఖ్యమో మాకు నేతన్న కూడా అంతే ముఖ్యమని తెలిపారు.

- నేతన్నల కళ్లలో ఆనందం చూడాలని
- నేతన్నలకు ఏడాదికి 1.30 కోట్ల చీరల ఆర్డర్
- డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఏడాదికి రెండు చీరలు
- IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
- ఈ ఏడాది నుంచే పని చేయనున్న ఇన్స్టిట్యూట్
- ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy । చేనేత రుణాలు రూ.30కోట్లు మాఫీ చేసి చేనేత కార్మికులను రుణ విముక్తులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. రైతన్న ఎంత ముఖ్యమో మాకు నేతన్న (handloom workers) కూడా అంతే ముఖ్యమని తెలిపారు. సోమవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేత కార్మికుల కళ్లలో ఆనందం చూడాలని రూ.290 కోట్ల బకాయిలు విడుదల చేశామన్నారు. అలాగే నేతన్నలకు ఏడాదికి 1.30 కోట్ల చీరల ఆర్డర్ ఇవ్వనున్నట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నేతన్నలను ఆదుకోవాలన్న ఉద్దేశంలో రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల (self-help groups) సభ్యురాళ్లకు ఏడాదికి రెండు చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.
గతంలో ఆర్భాటం, సినీ తారల తతళుకు బెళుకులు తప్ప.. నేతన్న ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల (Bathukamma sarees) బకాయిలను చెల్లించకుండా ఆలస్యం చేసిందని, కానీ మేం బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి.. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల (Sirisilla) కార్మికులను ఆదుకున్నామని రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారని తెలిపిన రేవంత్ రెడ్డి ఏడాదికి ఒక్కో సభ్యురాలికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మంచి డిజైన్, క్వాలిటీ తో ముందుకు రావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏడాదికి దాదాపు కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను నేతన్నలకు ఇవ్వనున్నామని తెలిపారు.
సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిస్తున్నానని చెప్పారు. మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదని, తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji)ది అసలు సిసలైన త్యాగమన్నారు. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. మేరకు వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా అని సభాముఖంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ విద్యార్థులు IIHTలో చేరాలంటే ఒడిశా, ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని రేవంత్ తెలిపారు. తెలంగాణలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం పదేళ్లుగా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ ఉండి తీరాలని ప్రధాని, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ సంవత్సరమే ఇనిస్టిట్యూట్ మొదలుపెట్టాలని మేం అధికారులను ఆదేశించామన్నారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ (Skill University) ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి స్కిల్స్ యూనివర్సిటీలో IIHT భవనం ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ వెల్లడించారు.