Rythu Runa Mafi | బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు లక్షలోపు రుణం మాఫీ అయిపోయిందన్న సీఎం తమకు తెలియదంటున్న బ్యాంకు అధికారులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతన్న దిగులు ఇదీ మంచిర్యాల అన్నదాతల రుణమాఫీ గోస విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకం అమలు అయోమయంలో పడింది. కొంతమంది రైతులకే లబ్ధి చేకూరినట్టు తెలుస్తున్నది. అర్హులైన సగం మంది రైతులు ఈ పథకానికి దూరంగానే ఉన్నారని సమాచారం. ఖాతాలకు సొమ్ము జమకాక, […]
Rythu Runa Mafi |
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకం అమలు అయోమయంలో పడింది. కొంతమంది రైతులకే లబ్ధి చేకూరినట్టు తెలుస్తున్నది. అర్హులైన సగం మంది రైతులు ఈ పథకానికి దూరంగానే ఉన్నారని సమాచారం. ఖాతాలకు సొమ్ము జమకాక, బ్యాంకుల చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. తమకు రుణమాఫీ కాదన్న ఆందోళన చాలా మంది రైతుల్లో నెలకొంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు రుణ మాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే చివరి విడత జాప్యం కావడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నెలన్నరలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్టు ప్రకటించింది.
45 రోజుల కార్యాచరణ
రాష్ట్రవ్యాప్తంగా రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నెల క్రితం ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచింది. ఆగస్ట్ 2న సీఎం ప్రకటనతో తీపి కబురు అందించారు. ఆలస్యమైనా, రుణాలు మాఫీ అవుతున్నాయని రైతులు సంతోషపడ్డారు.
టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. 45 రోజుల కార్యాచరణతో దశలవారీగా రైతుల రూ.లక్ష లోపు రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే నెల గడిచింది. రుణమాఫీ అయిపోయిందని బీఆరెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించారు. అయినా.. ఇప్పటికీ మంచిర్యాల జిల్లాలో 50% వరకూ రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమకాలేదని సమాచారం.
48 శాతం మాత్రమే మాఫీ?
తమకు రుణమాఫీ అందలేదని రూ.60 వేల నుంచి రూ.70 వేల లోపు రుణం తీసుకున్న కొంతమంది మంచిర్యాల జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే.. 48 శాతం రైతులకు మాత్రమే మాఫీ అయినట్లు తెలుస్తున్నది. అంటే ఇంకా 52% రైతులకు మాఫీ చేయాల్సి ఉంది.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 92,912 మంది రైతులు 2018 ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. కేసీఆర్ రుణమాఫీ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు 41,928 మంది రైతులకు మాత్రమే వ్యవసాయ రుణమాఫీ డబ్బులు బ్యాంకులో జమ అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ లెక్కల ప్రకారం 52,984 మంది రైతులకు రుణమాఫీ కాలేదని స్పష్టమవుతున్నది.
అధికారుల చుట్టూ ప్రదక్షణ
తోటి రైతులకు రుణమాఫీ అవుతున్న నేపథ్యంలో, రుణమాఫీకాని రైతులు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ సరైన సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక మంచిర్యాల పరిస్థితి కాదు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
స్పష్టమైన సమాచారం ఇచ్చే అధికారి లేడని రైతులు వాపోతున్నారు. ‘అగ్రికల్చర్ అధికారుల వద్దకు వెళ్తే.. మేం బ్యాంకు రుణాలు ఇవ్వలేదు. ఇచ్చిన వారి వద్దే సమాచారం ఉంటుంది. మాకేమీ తెలియదు అని సమాధానం చెబుతున్నారు.
బ్యాంకు సిబ్బందిని అడిగితే, రుణమాఫీ ఎందుకు జరగలేదు అనే సమాచారం మా దగ్గర లేదు.. అది గవర్నమెంట్ చూసుకుంటుంది’ అని చెబుతున్నారని ఒక రైతు వాపోయారు. మరి ఈ విషయం ఎవరి వద్ద చెప్పుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రుణం మాఫీ అయితే అదృష్టవంతుడు.. కాకపోతే దురదృష్టవంతుడని దేవుని మీద భారం వేశామని రైతులు అంటున్నారు.
అధికార పార్టీ వారికేనా..?
ఇటీవల కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ కూడా అలానే చేస్తారా? అని కొందరు రైతులు ఆందోళన గురవుతున్నారు. రైతు పక్షపాతిగా చెప్పుకొనే కేసీఆర్ ప్రభుత్వం.. అర్హులైన రైతుల రుణాలు రుణమాఫీ కాకపోవడానికి ఏం సమాధానం చెబుతుందని నిలదీస్తున్నారు.
రుణ మాఫీ డబ్బు జమగాని రైతులు సమాచారాన్ని ఎవరికి తెలియజేయాలో చెప్పాలని కోరుతున్నారు. 2018 ఎన్నికల మ్యానిఫెస్టో పొందుపరచిన హామీ.. 2019 లోపే పూర్తి కావలసి ఉంది. ఐతే ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రుణ మాఫీ చేయాలని కోరుతున్నారు.
రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు..
పూర్తిస్థాయిలో అందరికీ రుణమాఫీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందా? లేదా? అనే ప్రశ్నలు రైతులలో ఉత్పన్నమవుతున్నాయి. రుణమాఫీ కాని రైతుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రుణమాఫీ ప్రకటన వచ్చి నెల గడుస్తున్నది.
మరో 15 రోజులే గడువు ఉంది. ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో పూర్తి పారదర్శకంగా న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గతంలో ఇచ్చిన హామీని విస్మరించినట్లయితే రాబోయే ఎన్నికల్లో రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
రుణమాఫీ జమ కాలేదు..
మా స్వగ్రామం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల. గ్రామంలోని దక్కన్ గ్రామీణ బ్యాంకులో 2018 జూన్ లో రూ.35 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నా. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో ఎంతో సంబరపడ్డా. ఇంతవరకు ఖాతాకు డబ్బు జమ కాలేదు.
– గడ్డం లచ్చయ్య, రైతు
సరైన సమాధానం లేదు..
మంచిర్యాల యూనియన్ బ్యాంకులో 2018 ఏప్రిల్ లో రూ.80 వేల వ్యవసాయ రుణం తీసుకున్నా. ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు. బ్యాంక్, వ్యవసాయ అధికారులను అడిగినా మాకు తెలియదని చెబుతున్నారు. ఎవరిని అడగాలో జవాబుదారీతనం లేకుండా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీ చేయాలి. ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
– శ్రీనివాస్, రైతు, ముల్కల
వడ్డీలు పెరుగుతున్నాయ్..
మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని దక్కన్ గ్రామీణ బ్యాంకులో 2018 ఆగస్టులో రూ.60 వేల వ్యవసాయ రుణం తీసుకున్నా. ఇప్పుడు వడ్డీతో రూ.82వేలు అయ్యింది. ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని పలుమార్లు బ్యాంకు అధికారులను సంప్రదించా. మాకేం తెలియదని చెప్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీకి చర్యలు తీసుకోవాలి.
– నారాయణరెడ్డి, రైతు.