UP Woman Marries Lord Krishna Idol : శ్రీకృష్ణుడి విగ్రహంతో యువతి పెళ్లి వైరల్

శ్రీకృష్ణుడిపై భక్తి పారవశ్యంతో ఉత్తరప్రదేశ్ యువతి పింకీ శర్మ కృష్ణుడి విగ్రహంతో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

UP Woman Marries Lord Krishna Idol : శ్రీకృష్ణుడి విగ్రహంతో యువతి పెళ్లి వైరల్

విధాత, : శ్రీకృష్ణుడిపై భక్తి పారవశ్యంతో చరిత్రలో మీరాబాయి అనే భక్తురాలు తన జీవితాన్ని ఆయన చరణ సేవకే సమర్పించింది. తననే భర్తగా భావించి జీవితాంతం కృష్ణుడి కీర్తనలను ఆలపిస్తూ ఆయనలోనే ఐక్యమైంది. శ్రీకృష్ణుడి పట్ల అంతటి భక్తిని కల్గిన అభినవ మీరా బాయిలు తరుచు వెలుగుచూస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల పింకీ శర్మ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సంప్రదాయ హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ఆమెకు చిన్నప్పటి నుంచీ శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. చివరకు ఆ జగన్మోహుడినే తన భర్తగా భావించి ఆయననే పెళ్లి చేసుకుని ఆజన్మంతా భక్తులరాలిగా మారిపోయింది.

తన కుటుంబ సభ్యులు, చుట్టాలు, గ్రామస్థుల సమక్షంలో నిజమైన పెళ్లి వేడుక తరాహాలో అన్ని ఆచార సాంప్రదాయాల నడుమ కృష్ణుడి విగ్రహంతో పెళ్లి తంతు జరుపుకుంది. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైయూర్ కాశీమాబాద్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహా వేడుకలో భాగంగా పింకీ ఇంటిని వైభవంగా అలంకరలించారు. పెళ్లి మండపం ఏర్పాటు చేశారు. ఆమె బావ ఇంద్రేష్ కుమార్, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వరుడిలా ముస్తాబు చేసి కారులో బంధుమిత్రులతో కలిసి బరాత్‌ ద్వారా వివాహా వేదికకు చేరుకున్నారు. బరాత్‌ ఊరేగింపు ఇంటికి రాగానే, అత్తమామలు తమ అల్లుడిగా రాబోతున్న శ్రీ కృష్ణ భగవానుడికి సంప్రదాయ స్వాగతం పలికారు. వధువు పింకీ తన చేతుల్లో ఆ విగ్రహాన్ని ఎత్తుకుని పెళ్లి వేదికపైకి వెళ్లింది. ఆమె దేవుడి విగ్రహంతో దండలు మార్చుకుని తర్వాత సిందూరం పెట్టుకుంది. పెళ్లిలో అగ్ని సాక్షిగా వేసే ఏడు అడుగులు(సప్తపది) కూడా పింకీ కృష్ణుడి విగ్రహాన్ని ఎత్తుకునే వేసింది.

పెళ్ళి వేడుక సందర్భంగా విందు కూడా ఏర్పాటు చేశారు.బృందావనం నుంచి వచ్చిన కళాకారులు భక్తి పాటలు, డాన్స్ లతో అలరించారు. మరుసటి రోజు ఉదయం ఆమెని అత్తారింటికి పంపిన తంతును కూడా నిర్వహించారు. తన పెళ్లిపై స్పందించిన పింకి శర్మ జీవితంలో చదువు ముఖ్యం అయినప్పటికీ, తన జీవితం దేవుడికి అంకితమైందని, శాంతి, భక్తి సహా అన్ని కృష్ణుడి శరణాగతిలోనే ఉన్నాయని తెలిపింది.

పింకీ తండ్రి సురేష్ చంద్ర తన కూతురు పెళ్లిపై స్పందించారు. పింకీకి చిన్నప్పటి నుంచీ కృష్ణుడంటే ప్రాణం అని… నాలుగు నెలల క్రితం బృందావనంలోని బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం తీసుకుంటుండగా, ఒక బంగారు ఉంగరం ఆమె చున్నీలో పడిందని..ఇది దేవుడి ఆశీర్వాదంగా భావించిన పింకీ, ఇక ఏ మనిషిని పెళ్లి చేసుకోకుండా కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు, బృందావనంలో కృష్ణుడి విగ్రహాన్ని మోసుకుని గోవర్ధన పరిక్రమ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచిందన్నారు. ఆ తర్వాత ఆమె కోలుకోగా..అది కూడా దేవుడి సంకేతం అని మరింత గట్టిగా నమ్మిందని తెలిపారు. శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించడం జరిగిందన్నారు. కొడుకులతో సమానంగా కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానని స్పష్టం చేశారు. పింకీ తల్లి రామేంద్రికి మొదట్లో ఈ ఆలోచన వింతగా అనిపించినా, కూతురు భక్తిని ని అర్థం చేసుకుని ఒప్పుకున్నారని తెలిపారు.

రెండేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్ లోని ఔరేయా జిల్లాలోని బిధునా పట్టణం రక్షా సోలంకి అనే యువతి సైతం చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ..తల్లిదండ్రులను ఒప్పించి కృష్ణుడి విగ్రహానితో పెళ్లి చేసుకోవడం విశేషం.

ఇవి కూడా చదవండి :

Sequels | ముగింపు దశకు చేరుకున్న 2025… సీక్వెల్ సినిమాల పరాజయాలపై పెద్ద చర్చ!
Harish Rao : రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ మళ్లీ వెనుకబాటు