Insta Reel killed teen | పట్టాలపై రీల్స్ చేస్తూ రైలు ఢీకొని యువకుడు మృతి – ఒడిశాలో విషాదం
ఒడిశాలో 15 ఏళ్ల యువకుడు రైల్వే ట్రాక్పై రీల్ తీస్తూ రైలు ఢీకొని మృతి. సోషల్ మీడియా రీల్స్ మోజు మరోసారి విషాదానికి దారితీసింది. పోలీసులు తల్లిదండ్రులకు హెచ్చరికలు.

Odisha Teen Killed by Train While Filming Instagram Reel on Railway Tracks
(విధాత నేషనల్ డెస్క్)
పూరీ (ఒడిశా):
సోషల్ మీడియా రీల్స్ మోజు మరో ప్రాణం తీసింది. ఒడిశాలో 15 ఏళ్ల బాలుడు రైల్వే ట్రాక్పై ఇన్స్టాగ్రామ్ రీల్ తీస్తుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన మంగళవారం పూరీ జిల్లా, జనకదేవ్పూర్ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళఘాట్ ప్రాంతానికి చెందిన విశ్వజీత్ సాహు అనే యువకుడు తన తల్లితో కలిసి దక్షిణకాళీ దేవాలయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. మార్గమధ్యంలో రైల్వే పట్టాల దగ్గర మొబైల్ను ట్రైపాడ్పై పెట్టి రీల్ చిత్రీకరిస్తుండగా ఎదురుగా వస్తున్న రైలు అతడిని ఢీకొట్టగా, అతను అక్కడికక్కడే మరణించాడు.
సంఘటనా స్థలానికి రైల్వే పోలీసులు (GRP) చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు చెప్పిందాని ప్రకారం, రైలు దగ్గరగా వస్తున్న సమయంలో గాలి వేగానికి ట్రైపాడ్తోపాటు మొబైల్ కిందపడడంతో యువకుడి దృష్టి మళ్లి ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది. చిన్న వయసులోనే సోషల్ మీడియా క్రేజ్లో ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడటం బాధాకరమని వారు వ్యాఖ్యానించారు.
Tragic accident occurred in Puri district, #Odisha A 15-year-old boy was hit by train & died near #Janakdeipur railway station. The accident occurred while he was filming a video reel on his mobile phone on the railway track.#Reels#reelsvideo pic.twitter.com/XB613GdZX0
— Nikita Sareen (@NikitaS_Live) October 23, 2025
దేశవ్యాప్తంగా యువతలో సోషల్మీడియా రీల్స్ పిచ్చి
ఇటీవల దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. లైకులనీ, వ్యూసనీ యువత ప్రాణాలను పణంగా పెడుతున్నారనేది వాస్తవం. పోలీసు అధికారులు రైల్వే ట్రాక్లు, నీటి ప్రవాహాలు, ప్రమాదకర ప్రదేశాల్లో వీడియోలు తీయడం నిషేధమని స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. “వీడియో కోసం జీవితం కోల్పోవడం దురదృష్టకరం. తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా అలవాట్లపై దృష్టి పెట్టాలి” అని అధికారులు సూచించారు.
ఈ సంఘటన గత ఆగస్టులో జరిగిన మరో ప్రమాదాన్ని గుర్తు చేసింది. గంజాం జిల్లాకు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ సాగర్ తుడు కూడా కొరాపుట్ జిల్లాలోని దుడుమా జలపాతం వద్ద వీడియో తీస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో భారీ వర్షాల కారణంగా మచకుండ డ్యాం నుంచి విడుదలైన నీటితో జలపాతం ప్రవాహం పెరగడంతో సాగర్ బ్యాలెన్స్ కోల్పోయి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఫైర్ బ్రిగేడ్, పోలీసు బృందాలు వెతికినా కూడా అతని ఆచూకీ లభించలేదు.
సామాజిక మాధ్యమాల్లో ఈ రీళ్ల మోజు రోజురోజుకు పెరుగుతుండడంతో యువతలో నిర్లక్ష్యం పెరిగి, రిస్క్లకు సిద్ధపడుతున్నారనే వాస్తవం మరోసారి బహిర్గతమైంది. ఈ విధమైన ప్రమాదకర ప్రదేశాల్లో వీడియోలు తీయడం, సాహసాలు చేయడం కంటే జీవితం విలువైనదని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మానసిక వైద్య నిపుణులు పేర్కొన్నారు. పోలీసు శాఖ తల్లిదండ్రులకు, పాఠశాలలకు కూడా సోషల్ మీడియా బాధ్యతపై విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.