నేతలపై కేసులకు మరిన్ని న్యాయస్థానాలు

విధాత‌: ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు అవసరమైన చోట అదనంగా ప్రత్యేక కోర్టుల్ని నెలకొల్పాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ విషయంలో కేంద్రం, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ నిరాకరణకు దిగితే తగిన చర్యల నిమిత్తం దానిని తమ దృష్టికి తీసుకురావాలని తెలిపింది. ప్రజాప్రతినిధులపై ఉన్న అవినీతి కేసుల విచారణలో మితిమీరిన ఆలస్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ […]

నేతలపై కేసులకు మరిన్ని న్యాయస్థానాలు

విధాత‌: ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు అవసరమైన చోట అదనంగా ప్రత్యేక కోర్టుల్ని నెలకొల్పాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ విషయంలో కేంద్రం, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ నిరాకరణకు దిగితే తగిన చర్యల నిమిత్తం దానిని తమ దృష్టికి తీసుకురావాలని తెలిపింది. ప్రజాప్రతినిధులపై ఉన్న అవినీతి కేసుల విచారణలో మితిమీరిన ఆలస్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును గురువారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో చేర్చారు. దర్యాప్తు, విచారణలను వేగవంతం చేయడానికి ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌ శాసనకర్తల కేసులో విచారణకు భోపాల్‌లో ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయస్థాన సహాయకుడు (అమికస్‌ క్యూరీ) వ్యక్తం చేసిన అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. ‘‘సీబీఐ కేసుల్లో ప్రస్తుతం విచారణ సాగుతున్న తీరు ఆందోళనకరంగా ఉంది. విచారణల్లో వేగం పెరగడానికి వీలుగా సీబీఐకి తగినన్ని మానవ వనరుల్ని, మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని, అంశాన్ని ఆ సంస్థ డైరెక్టర్‌తో చర్చిస్తామని సొలిసిటర్‌ జనరల్‌ మాకు హామీ ఇచ్చారు. నిందితులు న్యాయస్థానంలో హాజరయ్యేందుకు, సీబీఐ న్యాయస్థానాల్లో అభియోగాల నమోదుకు తగిన చర్యల్ని సీబీఐ చేపట్టాలి. సాక్షుల్ని న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టడంలో ఎలాంటి అలసత్వం లేకుండా ఆ సంస్థ చూసుకోవాలి’’ అని ఆదేశించింది. రాష్ట్రాల పోలీసుల, ఇతర దర్యాప్తు సంస్థల పరంగా ఎలాంటి జాప్యం లేకుండా హైకోర్టుల నిరంతర న్యాయ పర్యవేక్షణ, నిఘా ఉండాలని తెలిపింది. ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం నిర్ణీత కాల వ్యవధుల్లో విచారణలు పూర్తయ్యేలా తగిన చర్యల్ని హైకోర్టులన్నీ చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ఒకటో, రెండో ప్రత్యేక కోర్టులు అన్ని విచారణల్నీ చేపట్టడం సాధ్యం కాదని, అందువల్ల వాటిని అత్యవసరంగా హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈడీ, సీబీఐ దర్యాప్తు చేసిన కొన్ని కేసుల్లో జాప్యానికి కారణాలు తెలుసుకునేందుకు పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేయాలన్న అమికస్‌ క్యూరీ నివేదికపై స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాజకీయ నాయకులపై కేసులను ఉపసంహరించేటప్పుడు ఏం చేయాలో ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని, తదుపరి ఆదేశాలు అవసరం లేదని తెలిపింది.