Local Body Elections | ‘స్థానికం’పై పట్టుకు కాంగ్రెస్ కసరత్తు.. క్షేత్రస్థాయి పురోగతిపై నిత్య పర్యవేక్షణ
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వివిధ మార్గాలతో పాటు సోషల్ మీడియా ద్వారా సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో పాటు తమ పలుకుబడి పలుచనకాకుండా ప్రయత్నాలు చేస్తున్నది.

Local Body Elections | రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో సైతం పట్టును ధించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలుకు యత్నిస్తోంది. పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలు ఒక వైపు రూపొందిస్తూనే అధికార పార్టీగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల మనుసులు గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీని కోసం అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడం ద్వారా తమ ఓటు బ్యాంకును పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి అధికార యంత్రాంగంతో పాటు జిల్లా యంత్రాంగాన్ని ఇటీవల పరుగెత్తిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం గడిచిపోయింది. రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులతోపాటు పాలన పై పట్టు సాధించేందుకు రేవంత్ సర్కారు తమదైనశైలిలో కృషి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసిపోయింది. ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రత్యేకాధికారులను నియమించి పాలన కొనసాగిస్తోంది. మరో వైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సమయం తీసుకున్నది సర్కారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు 90రోజుల గుడువు ఇస్తూ సెప్టెంబర్ 30వరకు డెడ్లైన్ విధించింది. ఈ పరిణామాలను ముందే అంచనా వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దూకుడు పెంచింది. దీనిలో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరుగ్యారంటీల అమలుకు చర్యలు చేపట్టి, ఉద్యోగాల భర్తీ యుద్ధప్రాతిపదికన చెపట్టింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వివిధ మార్గాలతో పాటు సోషల్ మీడియా ద్వారా సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో పాటు తమ పలుకుబడి పలుచనకాకుండా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో 2 లక్షల 30 వేలకు పైగా ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. లక్షకు పైగా ఇండ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురవడానికి ముందే ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్, బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ సీనరేజి ఛార్జిలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఉచిత లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఏ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందో, ఎంబీ రికార్డులను నమోదు చేసి లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలని, పనుల పూర్తికి లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేయాలని నిర్ణయించారు. పీఎం ఆవాస్ యోజన 13 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేసినందున ప్రతి పట్టణం నుంచి కనీసం 500 మంది నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టారు.
మరోవైపు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేసింది ప్రభుత్వం. ప్రతి జిల్లాలో ఎరువుల లభ్యత, స్టాక్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి కొరత రాకుండా పర్యవేక్షిస్తున్నారు. లక్షా 25 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు వి స్తరించే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. భూ భారతికి ప్రాధాన్యత, భూ భారతి చట్టం తీసుకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. వీటిని సాధా బైనామా, ఆర్ఓఆర్ సమస్యలు, పట్టాలో కరెక్షన్స్ వంటి వివిధ సమస్యలనును గుర్తించారు. ఆగస్టు 15 నాటికి ఈ ధరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు వనమహోత్సవాన్ని భారీగా చేపట్టేందుకు నిర్ణయించారు. డెంగ్యూ, మల్లేరియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు జిల్లాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణకు తాజాగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా తమ పార్టీ విజయం సాధిస్తుందని హస్తం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Banakacharla | మేఘా కంపెనీకి లబ్ధి కలిగించేందుకే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం : ఎమ్మెల్సీ కవిత
Tejeshwar murder | మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితో! తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు
shubhanshu shukla | ‘పసిపిల్లాడిలా నడక నేర్చుకుంటున్నాను’.. అంతరిక్షం నుండి పుడమికి తొలి సందేశం పంపిన శుక్లా
Show for Cash | డబ్బులివ్వండి.. మా రాసలీలలు చూడండి!