కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీడని స్టార్టింగ్ ట్రబుల్స్
పథకాలకు షరతుల పేరుతో నవ్వులపాలు..
వివాదం రేగగానే దిద్దుబాటు చర్యలు..
(విధాత ప్రత్యేకం)
ఎవరిస్తున్నారో తెలియదు సలహాలు! పథకాల అమలు వెనుక షరతులు ఎవరి ఆలోచనో తెలియదు!! రేవంత్ సర్కార్ నోట ఈ షరతుల ముచ్చట బయటకు రాగానే ఏదో వివాదం తలెత్తుతున్నది. వ్యతరేకత వస్తన్నది. ప్రతిపక్షానికి ఓ ఆయుధం దొరుకుతున్నది. వెంటనే అది తడబాటని తెలుసుకుంటున్నారు. దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. కానీ అప్పట్లోగా ఎంత ప్రచారం జరగాలో.. ఎంత డ్యామేజీ జరగాలో జరిగిపోతున్నది. ప్రతిపక్షం ఈ విషయాలను వెంటనే అందిపుచ్చుకుంటున్నది. ఇది జరిగే ముందే సర్కార్ ఆలోచించాలి. కానీ తెలిసీతెలియక అలా ఫీలర్లు వదులుతున్నది. అది వెంటనే బెడిసికొడుతున్నది. ఆ వెంటనే సర్కార్ తగ్గుతున్నది. ఆ లోపు నవ్వల పాలవుతున్నది. సరే, గతంలో కేసీఆర్ సర్కార్కు చెప్పేవాడు లేడు.. కేసీఆర్ వినేది లేకుండె. ఇప్పుడలా లేదు. కనీసం రేవంత్ సర్కార్ దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. తప్పును చక్కదిద్దేందుకు వెనుకంజ వేయడం లేదు. అంత వరకు ఓకే. కానీ, ఈ గ్యాప్ కూడా రాకుండా చూసుకుంటే బెటరేమో అనే అభిప్రాయాలు వస్తున్నాయి.
సర్వీస్ పెన్షన్ తీసుకుంటూ ఆసరా కూడా తీసుకుంటున్న పండుటాకుల వద్ద నుంచి పెన్షన్ రివకరీ ప్రయోగం చేయమడం బెడిసికొట్టింది. వెంటనే ఈ డ్యామేజీని కవర్ చేసేందుకు ఇప్పడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు… మార్గదర్శకాలు రూపొందిస్తున్నామన్నారు. రైతు రుణమాఫీపై రేషన్ కార్డు నిబంధన పెట్టారు. అర్హులైన రైతులకే ఇవ్వాలనే ఉద్దేశాన్ని జనం గ్రహిస్తారని భావించి ఉంటారు. కానీ ఇదీ తిరగబడింది. రేషన్ కార్డు లేని వారు రైతులు కారా? వాళ్లు వ్యవసాయం చేయడం లేదా? గత ప్రభుత్వం వీరిని రైతులుగా గుర్తిస్తే, ఈ ప్రభుత్వం ఎందుకు రైతులుగా గుర్తించడం లేదనే పోలికను తీసుకొచ్చారు. ఇదీ ఎదురుతన్నింది. అప్పటికప్పుడు నష్టనివారణ కోసం రేషన్ కార్డు క్రైటీరియా కాదు.. కేవలం కుటుంబంలో ఒకరికి ఇచ్చేందుకు ప్రామాణికం కోసమేనని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ అమలు అదే జరగనుంది. తొలుత రేషన్కార్డు ఉన్నవారందరికీ విడతలవారీగా రెండు లక్షల రుణమాఫీ చేసేలా సర్కార్ ప్లాన్ చేస్తున్నదని సమాచారం.
ఈ ప్రక్రియ మాటిచ్చినట్టుగా పంద్రాగస్టు లోపు జరిగిపోతుంది. ఇక ఆ తరువాత మిగిలిన వారి సంగతి చూద్దామని దీన్ని లైట్ తీసుకుంటున్నారు. పైకి మాత్రం ఆ షరతు నిబంధనను తప్పించేశారు. ఇక నిరుద్యోగుల విషయంలోనూ రేవంత్ మాట్లాడిన కొన్ని మాటలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఆందోళనలు చేస్తున్న వారెవరూ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోలేదని వెటకారంగా మాట్లాడటం కూడా నిరుద్యోగులను మరింత రెచ్చగొట్టినట్టే అయింది. ఉద్యమాలు చేయాలంటే, ఆందోళనకు దిగాలంటే నిరుద్యోగులే అయి ఉండాలా? చేసే వారంతా అభ్యర్థులే ఉండాలా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయంలో సంయమనంతో సీఎం మాట్లాడాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక రైతు భరోసా విషయంలో కూడా ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఐదెకరాల సీలింగ్ మాట తెచ్చారు. ఇదీ రచ్చ రాజకీయానికే తెరతీయనుంది. మరి దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు గానీ, దిద్దుబాటు మాటలు ఏం చెబుతారో చూడాలి.