హోరాహోరీగా సాగిన ఎన్నికల అనంతరం కొలువుదీరిన లోక్సభ తొలి సమావేశాల్లోనే అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఢీ అంటే ఢీ అనే పద్ధతిలో మాట యుద్ధానికి దిగాయి
దుందుడుకు స్వభావంతోనే బీజేపీ
పోరుకు సిద్ధమైన ఇండియా కూటమి
కీలక అంశాలను ప్రస్తావించని మోదీ
బీజేపీని దీటుగా నిలదీసిన ప్రతిపక్షం
రానున్న రోజుల్లోనూ అదే తీరు?
న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన ఎన్నికల అనంతరం కొలువుదీరిన లోక్సభ తొలి సమావేశాల్లోనే అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఢీ అంటే ఢీ అనే పద్ధతిలో మాట యుద్ధానికి దిగాయి. దీంతో రానున్న రోజుల్లో సైతం పార్లమెంటు సమావేశాలు ఉభయ పక్షాల మధ్య నువ్వా? నేనా? అనే తీరులోనే సాగే అవకాశం ఉన్నదనే చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి గత రెండు లోక్సభలకు భిన్నంగా మోదీ మూడో హయాం సాగబోతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఖ్యాబలం రీత్యా అధికారపక్షంతో దాదాపు సమాన స్థాయిలో ప్రతిపక్షం ఉన్నది.
బీజేపీ పదేళ్ల తర్వాత సొంతగా మెజార్టీ లేక, భాగస్వామ్య పార్టీలపై ఆధారపడాల్సిన గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నది. మరోవైపు ప్రతిపక్షం పదేళ్ల తర్వాత లోక్సభలో నాయకుడిని కలిగి ఉన్నది. అయినా.. సంఖ్యాబలంలో తగ్గినా.. తమ వైఖరిలో మార్పేమీ ఉండబోదన్న సంకేతాలను బీజేపీ ఈ సమావేశాల ద్వారా ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక, స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో ప్రతిపక్షాల డిమాండ్లను కనీసంగా పట్టించుకోకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాన మంత్రి ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, వరుసగా మూడోసారి ప్రతిపక్షం ఓడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ను పరాన్న జీవి పార్టీగా అభివర్ణించిన మోదీ.. మిత్రపక్షాల సహకారంతోనే 99 సీట్లు తెచ్చుకోగలిగిందని అన్నారు. మరోవైపు ఇండియా కూటమి పటిష్టంగానే ఉన్నదని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో చాటి చెప్పాయి. లోక్సభలో మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు.. మోదీ చరిష్మా కోల్పోయారని, మెజార్టీకూడా సాధించుకోలేని మోదీకి దేశానికి నాయకత్వం వహించే నైతిక అధికారం లేదని తేల్చి చెప్పాయి.
ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష కూటమి ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చిన రాజ్యాంగానికి ముప్పు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, విద్వేష ప్రచారాలు, రైతుల ఈతిబాధలు, అగ్నివీర్ పథకం వంటివాటిని ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగంలో రాహుల్ గాంధీ మరోసారి లేవనెత్తారు. నీట్ అంశాన్ని సైతం ప్రస్తావించారు. ఇక్కడ ప్రతిపక్ష కూటమిలో ఒక లోపం కనిపించింది. స్పీకర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్, తృణమూల్ భిన్నంగా స్పందించాయి. స్పీకర్ ఓంబిర్లా ఎమర్జెన్సీ ప్రస్తావన చేసినప్పుడు కాంగ్రెస్ నిరసనలో తృణమూల్ భాగస్వామి కాకపోవడం గమనార్హం. మొత్తంమీద కొత్త లోక్సభ తొలి సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు మరింత పెరిగాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. అంతేకాదు.. ఇంకా రెండు పక్షాలూ ఎన్నికల ప్రచారం మూడ్ నుంచి ఇంకా బయటపడినట్టు కూడా కనిపించడం లేదు.
తీరు మార్చుకోని ప్రధాని
బీజేపీకి మెజార్టీ లేనప్పటికీ, తాను రెండు కీలక భాగస్వామ్య పక్షాలపై ఆధారపడినప్పటికీ ప్రధాని మోదీ తన వ్యవహారశైలి మార్చుకున్నట్టు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 18వ లోక్సభ ప్రారంభ సమావేశాల్లో ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారని పలువురు చెబుతున్నారు. ఆయన రెండు గంటల పాటు ప్రసంగించినంత సేపూ ప్రతిపక్షాలు సేవ్ మణిపూర్, భారత్ జోడో అంటూ నినాదాలు చేయడం వినిపించింది. గతంలో ఏ ప్రధాన మంత్రి తన ప్రసంగం సమయంలో ఇంతటి సుదీర్ఘ నిరసనలు, నినాదాలు ఎదుర్కొనలేదేమో! మోదీ ప్రసంగంలో మూడు అంశాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి.. రాహుల్గాంధీని, కాంగ్రెను తీవ్రస్థాయిలో విమర్శించడం, రెండోది వికసిత్ భారత్ అని పదే పదే చెప్పుకోవడం, మూడోది హిందూ మతానికి బలమైన సమర్థన వాస్తవానికి ఈ మూడు కొత్తగా చెప్పినవేమీ కాదు.. ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఇవే అంశాలు బీజేపీకి 63 సీట్లను తగ్గించి, సొంతగా మెజార్టీకి దూరంగా నిలిపాయి.
నిజానికి మూడో మూడో విడత పాలన రెండు ప్రధాన పరీక్షలు యూజీసీ నెట్, నీట్లలో అవకతవకలు, గొప్పగా చెప్పుకొన్న మౌలిక వసతులైన విమానాశ్రయాల్లో కూలిన కప్పులు, రైలు ప్రమాదాలు, భారీ ఎక్స్ప్రెస్ హైవేల్లో పగుళ్లు, ఆఖరుకు కొత్తగా నిర్మించిన రామాలయంలో వర్షపు నీటి లీకేజీలతో మొదలైంది. వీటికి తాజాగా హత్రాస్లో ఘోరమైన తొక్కిసలాట జమకూడింది. ఇక మణిపూర్ అంశం సరేసరి. లోక్సభలో మాట్లాడేందుకు ఇన్నర్ మణిపూర్ ఎంపీ బిమొల్ అకోయిజామ్కు అర్ధరాత్రికి అవకాశం ఇచ్చారు. విశేషం ఏమిటంటే.. లోక్సభలో మోదీ ప్రసంగంలో ఈ అంశాలేవీ చోటుచేసుకోలేదు. నీట్, యూజీసీ నెట్పై ఏదో మాటవరుసకు తేల్చిపారేశారు. రాహుల్ ప్రసంగంలో అనేక భాగాలను తొలగిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అధికార ప్రతిపక్షాల మధ్య మరింత ఆజ్యం పోసిందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రతిపక్ష నేత ప్రసంగంలో ఇంత భారీ కోతలు కూడా బహుశా ఇదే తొలిసారి అని చెబుతున్నారు. సాధారణంగా ప్రధాని మాటలకు ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్ష నేతకూ కూడా అంతే విలువ ఉంటుందని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. కానీ.. తొలి సమావేశాల్లోనే ప్రతిపక్ష నేత ప్రసంగంలో భారీ కోతలు విధించడం రాబోయే రోజుల్లో అధికార, విపక్షాల మధ్య నెలకొనే పరిస్థితికి సంకేతంగా నిలుస్తున్నదని అన్నారు. గత రెండు సభల కంటే భిన్నంగా ఈసారి సమావేశాలు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంచనా వేశారు. లోక్సభలో బలాబలాల్లో విప్లవాత్మక మార్పు ఉన్న విషయాన్ని గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 234 మంది సభ్యులతో బలంగా ఉన్న ప్రతిపక్షం గొంతు అణచాలంటే సాధ్యం కాదని చెప్పారు.