విధాత:రిజిస్ట్రేషన్ శాఖలోఅవినీతికి పాల్పడ్డ అధికారులు ,సిబ్బంది పై వెంటనే చర్యలు చేపడతామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అధికారులకు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ లో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్ట్ కేసులు పరిష్కారం పై గురువారం ఆ శాఖ ప్రధాన కార్యాలయం లో ఆయన సమీక్ష నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని కేసులనూ త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తీసుకున్న చర్యలను న్యాయస్థానాలకు ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు.
శాఖ పనితీరులో పారదర్శకత, అవినీతి నిర్మూలన పై దృష్టి సారించాలని శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఖాళీగా ఉన్న స్థానాల పై న్యాయస్థానాలలో ఉన్న కేసులను పరిష్కరించుకునే విధంగా వెంటనే చర్యలు తీసు కోవాలన్నారు.ఆ ఖాళీలు భర్తీ చేయాలని కూడా ఇన్స్పెక్టర్ జనరల్ ను ఆదేశించారు.
ప్రీమియం సేవలు అందించే నిమిత్తం ఎంపిక చేసిన నగరాలలో ఆధునిక వసతులతో కూడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రారంభానికి సంబంధించి కార్యాచరణ రూపొందించాల్సిగా ఆదేశించారు. మొదటి విడతగా తిరుపతి, విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాలలో ఈ కార్యాలయాలు ప్రారంబానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
పదోన్నతి వదులుకున్న సిబ్బంది విధిగా వారు పని చేసే కార్యాలయాన్ని వదిలి వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లవలిసియుండునని తెలియజేశారు.
ఈ సమీక్షలో కమిషనర్ & ఐజీ యం.వి.శేషగిరిబాబు ఐఏఎస్, అడిషనల్ ఐజీ ఉదయభాస్కర రావు, జాయింట్ ఐజీ వి. రవి కుమార్, జాయింట్ ఐజీ సరోజ, డీఐజీ నాగలక్ష్మి పాల్గొన్నారు.