ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవి కోసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవి కోసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ కలిసి అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 22న ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అయ్యన్నపాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఎవరీ అయ్యన్నపాత్రుడు..?
చింతకాయల అయ్యన్నపాత్రుడు.. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 24,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఇప్పటి వరకు ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1982లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. అయ్యన్నపాత్రుడు.. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని అందరూ భావించారు. కానీ యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి దక్కలేదు. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకు అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి ఖాయం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.