గత ఐదేళ్లుగా అంధకారంలో ఉన్న అమరావతి నగరం.. ఇప్పుడు రాత్రిళ్లు విద్యుత్తు వెలుగులతో ధగధగలాడుతున్నది. ఇన్నాళ్లూ ముళ్లపొదలు, నిర్మాణ శకలాల దిబ్బలు పేరుకుపోయిన ప్రాంతం.. ఇప్పుడు చదునుతేలుతున్నది. ఆశలు అడుగంటకుండా చేసిన పోరాటం.. కొత్త ఊపిరి పోసుకుంటున్నది.
చదును చేసే పనిలో జేసీబీలు, బుల్డోజర్లు
దారులన్నింటికీ విద్యుత్తు వెలుగులు
అమరావతి: గత ఐదేళ్లుగా అంధకారంలో ఉన్న అమరావతి నగరం.. ఇప్పుడు రాత్రిళ్లు విద్యుత్తు వెలుగులతో ధగధగలాడుతున్నది. ఇన్నాళ్లూ ముళ్లపొదలు, నిర్మాణ శకలాల దిబ్బలు పేరుకుపోయిన ప్రాంతం.. ఇప్పుడు చదునుతేలుతున్నది. ఆశలు అడుగంటకుండా చేసిన పోరాటం.. కొత్త ఊపిరి పోసుకుంటున్నది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, ప్రజల మోమున ఇప్పుడు చిరునవ్వు చిందుతున్నది. భవిష్యత్తుపై బలమైన విశ్వాసం పాదుకుంటున్నది. చంద్రబాబునాయుడు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు క్రమంగా పుంజుకుంటున్నాయి.
రంగంలోకి దిగిన అధికారులు
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం నేపథ్యంలో ఏపీ అధికారులు అమరావతిపై దృష్టిసారించారు. ఇంకా ప్రభుత్వం ఏర్పడనప్పటికీ.. దాని ప్రాధమ్యాలపై స్పష్టత ఉన్న అధికారులు.. అమరావతిలో ఐదేళ్లుగా పేరుకుపోయిన ముళ్లపొదలను జేసీబీలు పెట్టి తొలగిస్తున్నారు. అమరావతి రోడ్లకు విద్యుత్తును పునరుద్ధరించారు. మరోవైపు విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ, రాస్ట్ర ఆర్థిక పరిస్థితి, క్యాపిటల్ సిటీ ప్రాజెక్టు సహా వివిధ పెండింగ్ ప్రాజెక్టులపై స్టేటస్ రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నీరబ్కుమార్ అమరావతిని ఆకస్మికంగా సందర్శించారు. రాజధాని నగర నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు చెప్పారు. ఆ మేరకు అధికారులు పనులు ప్రారంభించారని తెలిపారు. పనులను ప్రాధాన్యక్రమంలో చేపడుతున్నట్టు చెప్పారు. పూర్తిస్థాయి పనులు ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత మొదలవుతాయని అన్నారు. పనులు ఆగిపోయిన 25 ప్రాంతాలను మొదటి దశలో తీసుకున్నట్టు చీఫ్ సెక్రటరీ చెప్పారు. సీడ్ రోడ్ యాక్సెస్, ఎమ్మెల్యే క్వార్టర్లు, ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్, సెక్రటేరియట్ టవర్స్, హైకోర్టుకు శాశ్వత భవనం, గెజిటెడ్ అధికారులకు ఇండ్ల ప్రాజెక్టు, 10 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, విద్యుత్తు సరఫరా, మురుగు కాల్వల వ్యవస్థ తదితర పనులు వెంటనే చేపడుతున్నట్టు తెలిపారు
. ఈ పనుల్లో దాదాపు 94 బుల్డోజర్లు, జేసీబీలు వంటి భారీ వాహనాలను ఉపయోగించి, పిచ్చిమొక్కలు, భూమిలో పెరిగిన చెట్లు, ముళ్లకంపలను తొలగించి, భూమిని చదును చేయిస్తున్నారు. గత రెండేళ్లుగా యాన్యుటీ అందని రైతులకు డబ్బులు చెల్లించే అంశాలను కూడా పరిష్కరిస్తామని నీరబ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత సీఆర్డీఏ కమిషనర్ ఒక నివేదిక సమర్పించారని, దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. క్యాపిటల్ రీజియన్లో పనులను పునఃప్రారంభించడంతోపాటు.. పోలవరం ప్రాజెక్టుపైనా స్థాయీ నివేదికను అధికారులు రూపొందిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాపై జెన్కో, ట్రాన్స్కో నుంచి చంద్రబాబునాయుడు నివేదికలు అడిగారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. గ్రామీణ ప్రాంతాల్లో వీధిలైట్లకు మరమ్మతులు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్న సంఘటనల నేపథ్యంలో వాటిని పునరుద్ధరించాలని కూడా చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. సీజనల్ వ్యాధులు విజృంభించే కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు తెలిసింది.
తన కాన్వాయ్ వెళుతున్న మార్గంలో ట్రాఫిక్ను ఆప వద్దని చంద్రబాబు ఇప్పటికే పోలీసు శాఖకు చెప్పారు. సాగునీటి రిజర్వాయర్లలో నీటి లభ్యతపై సమాచారాన్ని ఆయన కోరారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలోనే పాలనలో మార్పు గుర్తించేస్థాయిలో ఉండాలని ఆయన కోరుతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. జూన్ 12న చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జనసేన, బీజేపీ కూడా భాగస్వామ్యం అవుతాయని చెబుతున్నారు.