ఏపీకి జీవనాడిగా భావించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో గతంలో నేను పడిన కష్టమంతా మాజీ సీఎం జగన్ బూడిదలో పోసిన పన్నీరుగా చేశారని, వేలకోట్ల ప్రజాధనం వృధా చేశారని ఏపీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు ఆవేదన..ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధాత, హైదరాబాద్ : ఏపీకి జీవనాడిగా భావించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో గతంలో నేను పడిన కష్టమంతా మాజీ సీఎం జగన్ బూడిదలో పోసిన పన్నీరుగా చేశారని, వేలకోట్ల ప్రజాధనం వృధా చేశారని ఏపీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు ఆవేదన..ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టాక పొలవరం ప్రాజెక్టును సందర్శించి ఇప్పటిదాకా జరిగిన పనుల పురోగతిని, స్పిలే కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏరియల్ వ్యూ చేశారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఉండ తగని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని ఇదొక కేస్ స్టడీ అని మాజీ సీఎం జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని, నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ చేశారన్నారు.
అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేశారని, 2020 వరదల్లో డయాఫ్రం వాల్ 35 శాతం పాడయ్యిందని, రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని సీఎం చంద్రబాబు వివరించారు. దెబ్బతిన్న దానికి సమాంతరంగా మరోకటి నిర్మిస్తే రూ.447 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం అంతా కట్టాలంటే రూ.990 కోట్లు అవుతుందని చెప్పారు. రెండు కాపర్ డ్యామ్లను రూ.550 కోట్లతో నిర్మించారని పేర్కొన్నారు. రూ.2 వేల కోట్లు కాపర్ డ్యాం గ్యాప్ నిర్మాణానికి అవుతుందని, ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4 ఏళ్ల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారని తెలిపారు. కాపర్ డ్యాం సీపేజీలు ఉన్నాయని, వరదలు వస్తే మరింత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత నష్టం చేయాలో అంత నష్టం ప్రాజెక్టుకు చేకూర్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేదని, పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అదికారులు చెబుతున్నారని, అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారన్నారు.
టీడీపీ హయాంలోనే 72 శాతం పూర్తి..
పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించానని చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయని, జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశామని, ఇక 45.72 మీటర్ల డ్యాం ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును తగ్గించడానికి ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు. స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్ చేశామని, చైనాలో త్రీ గార్జియస్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ వాటర్ డిశ్ఛార్జి అవుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై నేను వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించానన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పిందని తెలిపారు. అలా మార్చితే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారని, ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణమని చెప్పారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రజలనే కాదు, మీడియాను, ప్రతిపక్ష నేతగా నన్ను కూడా ఇక్కడికి రానీయలేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు అంతా క్లిష్టంగా మారిపోయిందని, ఈ చిక్కుముడులు అన్నీ విప్పే ప్రయత్నం చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వాలని కలలు కన్నానని, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి చెందిన ప్రాజెక్టు ఇదని చంద్రబాబు పేర్కోన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏడాదికి సరాసరిన రూ.13,683 కోట్లు ఖర్చు చేశారని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సరిగ్గా అమలు చేయకుండా ప్రాజెక్టుని మరింత క్లిష్టంగా మార్చారని మండిపడ్డారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.