విధాత(అమరావతి): తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మరణించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పక్షంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి.
ప్రభుత్వ వైఫల్యమే
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రూయా ఘటన ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు.
రుయా ఆస్పత్రిలో కోవిడ్ మరణాలు..
సర్కారు హత్యలే
తిరుపతి ఆస్పత్రిలో సంభవించిన మరణాలు ముమ్మాటికీ సర్కారు చేసిన హత్యలే అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆక్సిజన్ అయిపోయేంతవరకూ పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతోందని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టలేదు
ఆక్సిజన్ సరఫరా లోపంతో మరణాలు సంభవించడం బాధాకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఆక్సిజన్ అందక 10 రోజుల్లో 35 మందికి పైగా కరోనా రోగులు మరణించారని తెలిపారు. కరోనా రెండో దశ ప్రమాదాన్ని గురించి నిపుణులు, శాస్త్రవేత్తలు, మేధావులు హెచ్చరిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టలేదని మండిపడ్డారు. రుయా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశా.
జగన్పై కేసు నమోదు చేయాలి
తిరుపతి ఘటన బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారివన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. తిరుపతి ఘటనకు బాధ్యులను చేస్తూ సీఎం జగన్పై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రుయాలో ఘటప విషాదకరం
తిరుపతి 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే వార్త తీవ్ర ఆవేదనను కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, కర్నూలు, హిందూపురంలో ఆక్సిజన్ సరఫరా అందక పలువురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి విషాదకర ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలి.