YS Sharmila : తెలుగు జాతికి నేడు చీకటి రోజు

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు బిడ్డకు మద్దతు ఇవ్వని టీడీపీ, వైసీపీ, జనసేనలపై వైఎస్ షర్మిల ఫైర్—తెలుగు జాతికి తీరని ద్రోహమని విమర్శలు.

YS Sharmila : తెలుగు జాతికి నేడు చీకటి రోజు

విధాత: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైసీపీలు తెలుగు బిడ్డ బి. సుదర్శన్ రెడ్డిని కాదని ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయడం.. తెలుగు జాతికి నేడు చీకటి రోజు అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల తప్పుబట్టారు. ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీలు తెలుగు జాతికి చేసింది నేడు తీరని ద్రోహం అని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతిగా పోటీ పడితే..ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు అని షర్మిల విమర్శించింది. తెలుగు ప్రజల ప్రయోజనాల కన్నా.. స్వలాభమే ధ్యేయంగా.. మత పిచ్చి మోదీకి మోకాళ్లోత్తడమే లక్ష్యంగా.. టీడీపీ, వైసీపీ, జనసేనలు చేసిన నీచ రాజకీయాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదని దుయ్యబట్టారు.

తెలుగు బిడ్డ, న్యాయ నిపుణులు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం అత్యంత బాధాకరం అని..తెలుగు పార్టీలు తెలుగు బిడ్డకు మద్దతుగా నిలవకపోవడం అత్యంత దురదృష్టకరం అని షర్మిల ఆవేదన వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో ఇది తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానం అని..దీనిపై చంద్రబాబును, జగన్ మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నిస్తున్నాం అని పేర్కొన్నారు.

మోదీతో ప్రయోజానాలే వారికి ముఖ్యం

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కంటే మోదీతో స్వప్రయోజనమే మీకు ముఖ్యమా..? పోటీలు పడి మోదీ దగ్గర మోకరిల్లాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది..? అని షర్మి ప్రశ్నించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం మీకు కనిపించలేదా..? 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి గొంతు కోసిన విధానం గుర్తుకు రాలేదా..? ఢిల్లీని మించిన రాజధాని కడతామని 11 ఏళ్లుగా దగా పడ్డామని అనిపించలేదా..? రాష్ట్ర జీవనాడి పోలవరంలో జీవం తీసేస్తే మీలో చలనం లేదా..? విశాఖ స్టీల్ ను పబ్లిక్ గా అమ్ముతుంటే మీకు రోషం లేదా..? దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మీరు ఎలాగో కీలుబొమ్మలు.. కనీసం సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుంటే రాష్ట్రం గురించి అడిగే స్వరం ఢిల్లీలో ఉండేదన్న సోయి లేకపోవడం బాధాకరం అన్నారు.

కూటమి పార్టీలతో తోడుగా పోటీపడి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు వైపీపీ సిగ్గుపడాలి అని..ప్రతిపక్షంలో ఉంటూ, ప్రతిపక్షాల అభ్యర్థిని కాదని అధికార పక్షానికి మద్దతు ఇవ్వడం ప్రపంచంలోనే ఇదొక వింత అని షర్మిల విమర్శించారు. ఇక రాష్ట్రంలో వైసీపీకి ప్రతిపక్షం, ప్రజల పక్షం అని చెప్పుకోవడానికి అర్హత లేదన్నారు. అపోజిషన్ ముసుగులో రాష్ట్రంలో జగన్ కూడా బీజేపీ పక్షమేనని. బీజేపీకి అవసరమైనపుడు పనికొచ్చే పక్షమేనని.. 5 ఏళ్లలో దోచుకున్నది దాచుకోవడానికి కేంద్రానికి బానిస అయ్యారని…కేసులకు భయపడి మోదీకి దాసోహం అన్నారని షర్మిల ఆరోపించారు. తనను తాను రక్షించుకునేందుకు దత్తపుత్రుడిగా అవతారం ఎత్తి తెలుగు జాతికి జగన్ నేడు చేసింది తీరని ద్రోహమే అని షర్మిల విమర్శించింది.