విధాత: కరోనా కట్టడికి తూర్పు నావికాదళం రంగంలోకి దిగింది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, ఉత్పత్తి, సరఫరాను నేరుగా పర్యవేక్షించడంతోపాటు, ప్లాంట్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కరించనుంది. సీఎం జగన్ సూచనల మేరకు కోవిడ్- ఆక్సిజన్ మేనేజ్మెంట్పై సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు, ఉత్పత్తి, సరఫరా పై తూర్పు నావికాదళం ఈఎన్సీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో తూర్పు నావికాదళం ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ చేపట్టనుంది. ప్లాంట్లు లీకేజీలు, స్ధితిగతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నిర్వహణ బాధ్యతలు తీసుకోనుంది. ఇందుకోసం అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం మూడు నుంచి నాలుగు జిల్లాల్లో నిర్వహణా బాధ్యతలు తీసుకోనుంది. ఎక్కడ అవసరమైతే అక్కడకి ఈ బృందాలను వాయుమార్గంలో తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేక బృందాలు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయాలు, ఇతర ఇబ్బందులను పరిష్కరిస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం చేసేందుకు నావికాదళం అంగీకరించింది. సింగపూర్, థాయ్లాండ్, మలేషియా దేశాల నుంచి ఏపీకి రానున్న ఆక్సిజన్తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్ను తరలించేందుకు నావికాదళం అంగీకారించింది.
నిత్య అవసరాల కోసం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కంటైనర్స్ను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చేందుకు నేవీ అధికారులు ఆమోదం తెలిపారు. దీంతో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, డి–టైప్ ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కోవిడ్ చికిత్సకు అవసరమైన ఇతర వైద్య పరికరాల సరఫరాకు అంగీకరించారు.
ఐఎన్ఎస్ కళింగ ఆసుపత్రిలో 10 ఆక్సిజన్ బెడ్స్తో పాటు 60 పడకలును కోవిడ్ చికిత్స కోసం కేటాయించేందుకు తూర్పు నావికాదళం అధికారులు అంగీకరించారు. అదనంగా విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో 150 పడకల తాత్కాలిక ఆసుపత్రి కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అంగీకారం. ఇందుకు అవసరమైన వైద్యులు, పారామెడికల్ స్టాప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.
200 డి–టైప్ సిలిండర్ల అందించేందుకు ముందుకొచ్చిన నేవీ.
విశాఖ స్టీల్ ప్లాంట్ సాయం
రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్) సీఎండీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు.
కోవిడ్ చికిత్స కోసం అదనపు పడకలు ఏర్పాటుకు ముందుకొచ్చిన విశాఖ స్టీల్స్
850 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్లుకు గాను కేవలం 100 మెట్రిక్ టన్నుల ఎంఎల్ఓ ఉత్పత్తి అవుతుందని తెలిపిన స్టీల్ ప్లాంట్ అధికారులు.
2013లో ఈ ప్లాంట్ పూర్తైనప్పటికీ కాంట్రాక్టింగ్ ఏజెన్సీతో గతంలో సంప్రదింపులు పూర్తికాలేదన్న ఆర్ఏఎన్ఎల్ అధికారులు.
ప్రస్తుతం సంప్రదింపులు పూర్తైన దృష్ట్యా 6 నెలల్లో ప్లాంటు అందుబాటులోకి వస్తుందన్న స్టీల్ ప్లాంట్ అధికారులు
వారం రోజుల్లో ప్లాంట్ స్ధితిగతులపై అధ్యయనం చేయనున్న కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి చెందిన ప్రత్యేక బృందం
ఈ ప్లాంట్ సందర్శనకు అంగీకరించిన నావల్ డాక్యార్డు అధికారులు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి అవసరమైన సహాయానికి హామీ
ప్రస్తుతం ఈ ప్లాంట్ అందుబాటులోకి రానప్పటికీ భవిష్యత్తు అత్యవసరాలకు ఈ ప్లాంట్ గణనీయంగా ఉపయోగపడుతుందన్న ఆర్ఐఎన్ఎల్ అధికారులు.
గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం ఆక్సిజన్తో కూడిన 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంగీకారం.
వీటికి అదనంగా మరో 150 పడకలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి, మే 15 నాటికి అందుబాటులోకి వస్తాయన్న స్టీల్ ప్లాంట్ సీఎండీ
మే 30 నాటికి 250 పడకలు, జూన్ 2021 నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపిన స్టీల్ ప్లాంటు అధికారులు.
అందుకు తగిన విధంగా వైద్యులను, మెడికల్ స్టాప్ను అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని కోరిన స్టీల్ ప్లాంట్ అధికారులు.
నేవీ, స్టీల్ ప్లాంట్ అధికారుల విజ్ఞప్తి మేరకు వారి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం 4000 వాక్సిన్స్ను కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన స్టీల్ ప్లాంట్, తూర్పు నావికాదళ అధికారులు.