Gudlavalleru Engineering College | ఏపీలో దారుణం.. అమ్మాయిల వాష్రూమ్లో రహస్య కెమెరాలు.. నిందితుడి ల్యాప్టాప్లో 300 వీడియోలు!
ఆంధ్రప్రదేశ్లోని గుడ్లవల్లేరులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాలిక హాస్టల్ వాష్రూమ్లో రహస్య కెమెరాలు ఉంచి వీడియోలు తీసిన ఘటన సంచలనం రేపింది.

Gudlavalleru Engineering College | ఆంధ్రప్రదేశ్లోని గుడ్లవల్లేరులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ (Gudlavalleru Engineering College)లోని బాలిక హాస్టల్ వాష్రూమ్లో రహస్య కెమెరాలు (Hidden Cameras) ఉంచి వీడియోలు తీసిన ఘటన సంచలనం రేపింది. ఈ వీడియోలను విద్యార్థుల్లో సర్క్యులేట్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ ఉదంతంలో ఒక ఫైనల్ ఇయర్ విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్నానపు గదుల్లో రహస్య కెమెరాలు ఉంచిన ఉదంతంపై విద్యార్థులు భగ్గుమన్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పోలీసులను ఆదేశించారు.
దాదాపు 300 వీడియోలను చిత్రీకరించి, బాయ్స్ హాస్టల్లో సర్క్యులేట్ చేసినట్టు చెబుతున్నారు. వాష్రూమ్లో రహస్యంగా ఉంచిన కెమెరాను గురువారం రాత్రి ఒక విద్యార్థిని కనుగొనడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై విద్యార్థినులు రాత్రంతా కాలేజీలో నిరసనలకు దిగారు. తమకు భద్రత, ఆంతరంగిక గోప్యత కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ క్యాపస్లో గుమిగూడారు. దీనికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు రహస్య కెమెరాలు ఉంచినట్టు అనుమానిస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం ఎలాంటి రహస్య కెమెరాలు లేవని చెబుతున్నది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని పేర్కొంటున్నది. క్యాంపస్లో మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని మేనేజ్మెంట్ తెలిపింది. తాము నిందితుడి ల్యాప్టాప్, మొబైల్ , ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ సమక్షంలో పరిశీలించామని, అందులో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు.