ఇప్పటివరకు అవకతవకలకు పాల్పడ్డ మొత్తం 37 ఆస్పత్రులపై యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ. రాజేంద్రనాథ్ రెడ్డి
విధాత,విజయవాడ, 12 మే: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజుల్లో మొత్తం 15 ఆస్పత్రులను తనిఖీ చేసి 9 ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడట్లు నిర్ధారించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ. రాజేంద్రనాథ్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు మంగళవారం(11.5.21), బుధవారాల్లో(12.5.21) కూడా తనిఖీలు నిర్వహించినట్లు, మొత్తంగా ఇప్పటివరకు మొత్తం 37 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ధేశించిన రేట్ల కంటే అధిక మొత్తం వసూలు చేయడం, రెమిడిసివిర్ ఇంజక్షన్లు దుర్వినియోగం చేయడం, బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్మడం, ప్రభుత్వం అనుమతి లేకుండా కరోనా చికిత్స నిర్వహించడం, ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన రోగులకు కరోనా చికిత్సను తిరస్కరిస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించడం జరిగిందన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉన్న చైత్ర హాస్పిటల్ అధికంగా ఛార్జీలు వసూలు చేయడంతో పాటు పేషెంట్లు వారికి సంబంధించిన చికిత్సపై తప్పుడు సమాచారం అందించినట్లు గుర్తించి ఐపీసీ సెక్షన్లు 188, 420 తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 53 క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ. రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
అనంతపురంలోని ఆశా హాస్పిటల్ నందు ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420, 406 తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్లు 51(ఏ), 53 క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
విశాఖపట్టణం జిల్లా గోపాలపట్టణం ఎస్.ఆర్ హాస్పిటల్ నందు ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం మరియు రెమిడిసివిర్ ఇంజక్షన్లను దుర్వినియోగం చేయడం గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్లు 51(బి), 53 క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.