అమరావతి : ఆరోగ్యశ్రీ పై కూటమి ప్రభుత్వం మహా కుట్రలు చేస్తుందని..పథకం నిర్వీర్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు దివంగత సీఎం వైఎస్సార్ దేవుడైతే..పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసుడు అవుతున్నారని విమర్శించారు. ప్రైవేటు ఆరోగ్య బీమా ముసుగులో.. సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేస్తున్నారని మండిపడ్డారు. రూ.2700 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టడం ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగం అని ఆరోపించారు. ఏడాదిలో నెట్వర్క్ ఆసుపత్రులు రెండు సార్లు సమ్మెకు దిగినా.. బిల్లులు చెల్లింపుపై పట్టింపు లేదంటే ప్రజారోగ్యంపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. నెల రోజులుగా ఓపీ సేవలు నిలిపివేసినా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం అత్యంత దారుణం అన్నారు. వైద్య సేవలు పునరుద్ధరించకపోవడం ఆరోగ్యశ్రీపై ప్రభుత్వానికున్న నిర్లక్ష్యానికి నిదర్శనం అని షర్మిల విమర్శించారు.
ఆరోగ్య బీమా విఫల పథకం
పేదల ఆరోగ్య ప్రధాత ఆరోగ్యశ్రీ అని..దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ మానసపుత్రిక ఈ పథకం అని షర్మిల గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు మరో పునర్జన్మ, ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసాగా నిలబడిందన్నారు.
ఇంతటి మహత్తరమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించడం దారుణం అన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేయడం సహించరాని చర్యగా పేర్కొన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అన్నారని..ఇప్పుడు 10 శాతానికి కుదించి రూ.2.5 లక్షల ప్రైవేట్ బీమాతో సరిపెట్టారని షర్మిల విమర్శించారు. రూ.2.5 లక్షలు దాటితే మళ్లీ ఆరోగ్యశ్రీ కింద ఇస్తారట అని.. పేదల ఆరోగ్యం విషయంలో ఇంత నాటకం ఎందుకు ? అని షర్మిల నిలదీశారు. పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీపై ఇన్ని కుట్రలు ఎందుకు ? అని ప్రశ్నించారు. ప్రైవేటుకు లాభం కోసం ప్రభుత్వ పథకాన్ని చంపాలా? అని, ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4 వేల కోట్ల కేటాయింపుకి మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడానికి వేల కోట్లు ఎలా వస్తాయి ? అని నిలదీశారు.
ఆరోగ్యశ్రీ కింద 1.60 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే దానికన్నా.. బీమా కంపెనీలకు ఇచ్చేది తక్కువనా ? అని ప్రశ్నించారు. దేశంలో ప్రైవేట్ బీమా అమలు చేసిన 18 రాష్ట్రాల్లో తిరిగి 16 రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకున్నాయని గుర్తు చేశారు. ప్రైవేట్ బీమా భారం తప్పా లాభం కాదని ఒప్పుకున్నాయన్నారు. ట్రస్ట్ విధానంలో ఇంతకాలం నడిచే మన రాష్ట్రంలో ప్రైవేట్ బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ కి లింక్ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ట్రస్ట్ విధానంలోనే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని నడపాలని కోరారు. ఆసుపత్రులకు బకాయిలు పడ్డ రూ.2700 కోట్లను తక్షణం చెల్లించి, వెంటనే సమ్మెను విరమింపజేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.