విధాత: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి సరిపడా వ్యాక్సిన్ డోసులు పంపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులకు డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్ విధానం వల్ల.. రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ అందడం లేదని మంత్రులు అంటున్నారు.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పలు కేంద్రాలకు ఇంకా వ్యాక్సిన్ డోసులు అవసరం. ఈ పరిస్థితుల్లో ఓ రెండ్రోజులపాటు వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
వ్యాక్సిన్ కేంద్రాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాకుండా.. ఓ పక్కా విధానం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇందులో భాగంగా ముందుగానే ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు వ్యాక్సిన్ పంపిణీ పై అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం చాలా మందికి మొదటి డోసు తీసుకొని రెండో డోసు కోసం వేచి చూస్తున్నారు. వీరికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ప్రజలు నేరుగా వ్యాక్సిన్ తీసుకొనే అవకాశం లేదు. కచ్చితంగా కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు? అన్న విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది. ముందుగా ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. వ్యాక్సిన్ డోసు ఇవ్వవలసిన వారికి ఏ సమయంలో ఏ టైంలో రావాలో ముందుగానే సమాచారం ఇవ్వబోతున్నారు.
ఇలా చేస్తే వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసమే ఇవాళ రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశారు.