మహానటుడు, టీటీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ టీడీపీ మహానాడులో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. దేశానికి, రాష్ట్రానికి, కళారంగానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదిక ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఎన్టీఆర్‌ ఆశయాలకు అంకితమై భావితరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని, చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నటనలో, రాజకీయాల్లో, పాలనా రంగంలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ నూతన ఒరవడిని సృష్టించిన మహానీయుడని గుర్తు చేశారు.