Jagan | గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైసీపీ శ్రేణులపై దాడుల పట్ల జగన్ ఆందోళన
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగిస్తున్న దాడుల పట్ల గవర్నర్ జోక్యం చేసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు

విధాత : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగిస్తున్న దాడుల పట్ల గవర్నర్ జోక్యం చేసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. టీడీపీ దాడులతో రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందని, ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని, ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని జగన్ గవర్నర్కు చేసిన పోస్టులో పేర్కోన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2024
వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని, అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని, వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని జగన్ పేర్కోన్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నామన్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ భరోసానిచ్చారు.