ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడమే వైసీపీ పాలన విధానమని, చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయల్దేరారని సీఎం జగన్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.
విధాత : ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడమే వైసీపీ పాలన విధానమని, చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయల్దేరారని సీఎం జగన్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కర్నూల్లో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించి ఎన్నికలప్పుడు మళ్లీ సిద్దమా అని బలుయదేరారని, ప్రత్యేక హోదా అని మోసం చేసేందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికా? దేనికి సిద్దమని షర్మిల ప్రశ్నించారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని చేయలేదని, కనీసం మంచినీళ్లు లేవన్నారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేయలేదని, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగర వాసులకు నీళ్లు వచ్చేవన్నారు. కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పగా ఎక్కడా కనపడటం లేదని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ, విద్యుత్తో పాటు అన్నింటి ఛార్జీలు పెంచారని విమర్శించారు.