మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ ఎంపీగా ప్రజలను నన్ను దీవించి పార్లమెంటుకు పంపించిన పక్షంలో కేంద్రంలో మూడోసారి రాబోయే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గం
విధాత, హైదరాబాద్ : మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ ఎంపీగా ప్రజలను నన్ను దీవించి పార్లమెంటుకు పంపించిన పక్షంలో కేంద్రంలో మూడోసారి రాబోయే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి పాటుపడుతానని ఈటల రాజేందర్ హామీనిచ్చారు. మంగళవారం ఓల్డ్ బోయిన్ పల్లి లో నిర్వహించిన రైతు సమ్మేళనంలో, మల్కాజ్గిరి, దుర్గాపురం బుడగ జంగాల బస్తీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో ఈటల పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, రైతు రుణమాఫీ, 500బోనస్ ఇస్తామని రైతులకు హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ హామీలపైన, సీఎం రేవంత్రెడ్డి మాటలపైన ప్రజలకు నమ్మకం పోయిందన్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ బూటకపు హామీలను పేదలు నమ్మడంతో పాటు బీఆరెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు. గత పదేళ్ల ప్రధాని మోదీ పాలనలో ప్రశాంతంగా ఉన్నామని, మరోమారు ఆయనకే ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తున్నారని, ఇప్పుడు ఏ ఇంటికి పోయినా బీజేపీ కార్యకర్తలకు మిక్కిలి మర్యాదలు లభిస్తున్నాయని, పదేళ్ల క్రితం బీజేపీ తెలంగాణలో గెలుస్తుందని ప్రజలు నమ్మలేదు. కానీ ఇప్పుడు మోదీ పాలనపై అందరికీ విశ్వాసం ఏర్పడిందన్నారు. బీఆరెస్కు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే కానీ, పథకాల కోసం నిధులు లేవు. లంకెబిందెలు ఉన్నాయని వచ్చా, కానీ ఖాళీ ఖజానా కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అంటున్నాడని, మద్యం షాపుల వల్ల వచ్చే ఆదాయం తప్ప తెలంగాణకు ఆదాయం వచ్చే మార్గం లేదన్నారు. పైగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే హామీలన్నీ నెరవేర్చగలమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడని, కేవలం 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందన్నారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన హామీలను నెరవేర్చేది లేదని అర్థమవుతోందన్నారు.
పేదల సంక్షేమానికి కృషి చేస్తా
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థినైన నాకు ఇక్కడ సమస్యలను నేరుగా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లగలిగే చొరవ ఉందని, ఈ నియోజకవర్గంలో గెలిస్తే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు గెలిచినట్లు లెక్క అని, దేశంలోనే పెద్ద లోక్సభ నియోజకవర్గమైన ఈ స్థానంలో మనం గెలిస్తే, రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్థానాన్ని ప్రభావితం చేయవచ్చన్నారు. నేను మంత్రిగా ఉండగా పేదలకు రేషన్ కార్డులను, కులసర్టిఫికేట్ల మంజూరీలో నియోజకవర్గం వాసులకు సహాయం చేశానని తెలిపారు. కొందరికి బ్యాంకుల నుండి రిబేటులో రుణాలు కూడా ఇప్పించానని, ప్రభుత్వ హాస్టళ్లలో సన్నబియ్యం అన్నం పెట్టించానన్నారు. .కరోనా కాలంలో నేను ఎలా పని చేశానో మీకు తెలుసన్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశానో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పని చేశానో మీకు తెలుసని ఎంపీగా గెలిపిస్తే మరింత బాగా మీ కోసం పనిచేస్తానన్నారు. బీఆరెస్, కాంగ్రెస్ పార్టీల వారు ప్రజలను ఎంతో ప్రలోభపెడతారని, డబ్బు, మద్యం ఆశ చూపిస్తారని, వాటికి గురి కాకుండా ఒక్క ఓటు కూడా పోకుండా మన కార్యకర్తలు గట్టిగా పనిచేసి బీజేపీ పథకాలు ప్రజల్లో ప్రచారం చేసి, బీజేపీకే ఓట్లు పడేలా కృషి చేయాలని కోరారు. పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే నేరుగా తీసుకుంటుందని ప్రధాని మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల రూపాయల వరకూ పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. అంతేకాక ఇన్సూరెన్స్లు కూడా అమలు చేసే బాధ్యతను తీసుకుందని ఈటల పేర్కోన్నారు.